దాణా కుంభకోణానికి సంబంధించి మరో కేసులో లాలూను ఇప్పటికే దోషిగా నిర్ధారించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇవాళ శిక్షల్ని ఖరారు చేసింది. ఆయనకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 60 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. దాణా స్కాం కేసులో ఇప్పటికే నాలుగు కేసుల్లో లాలూ దోషిగా తేలారు. జైలు శిక్ష అనుభవిస్తూ పెరోల్ మీద విడుదలై ప్రస్తుతం బయటే ఉన్నారు.
ఈ ఐదో కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ను ఈనెల 15న దోషిగా తేల్చింది సీబీఐ స్పెషల్ కోర్టు. జార్ఖండ్లోని డోరాండా ట్రెజరీ (Doranda Treasury) నుంచి 139 కోట్ల నిధులను విత్ డ్రా చేసినట్టు తేల్చింది. ఈ కేసులో లాలూతో పాటు మాజీ ఎంపీ జగదీష్ శర్మ, అప్పటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ ధ్రువ్ భగత్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి బెక్ జూలియస్, పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ కేఎం ప్రసాద్ ప్రధాన నిందితులుగా ఉన్నారు. సాక్ష్యాధారాలు లేకపోవడంతో మరో 24 మందిని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. 1996 జనవరిలో లాలూ ఉమ్మడి బిహార్ సీఎంగా ఉన్న కాలంలో ఈ కుంభకోణం బయట పడింది. లాలూను నిందితునిగా పేర్కొంటూ 1997 జూన్లో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆయనతో పాటు జగన్నాథ్ మిశ్రాపైనా సీబీఐ అభియోగాలు మోపింది. 15 ఏళ్లలో 565 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలను సీబీఐ నమోదు చేసింది. ఆరుగురు పరారీలో ఉండగా.. 55 మంది మరణించారు.