లఖింపూర్ ఘటన కేసులో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది అలహాబాద్ హైకోర్ట్ లక్నో బెంచ్. ఆ ఘటనలో 8మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్, బీజేపీ కార్యకర్తలున్నారు. రాజకీయ పలుకుబడి ఉన్న ఆశిష్…సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని… విచారణపై ప్రభావం ఉండొచ్చని జస్టిస్ కృష్ణపహల్ బెంచ్ పేర్కొంది. బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన… ఈనెల 15 వరకు తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది.
అంతకుముందు ఫిబ్రవరి 10వ తేదీన ఆశిష్కు లక్నో బెంచ్ బెయిల్ మంజూరు చేసింది. అయితే సుప్రీం బెయిల్ రద్దుచేసింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగానే బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరిగి విచారణ జరిపింది.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనకు దిగిన సందర్భంలో… గతేడాది అక్టోబర్ 3న లఖింపూర్ ఖేరి జిల్లాలో రైతులపైకి వేగంగా వాహనం నడిపిన ఘటనలో నలుగురు చనిపోయారు. ఆ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసులో ఆశిష్ మిశ్రా సహనిందితుడిగా ఉన్నాడు.