రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న కేటీఆర్..ఇవాళ పలువురిని కలిశారు. ప్రపంచ ప్రఖ్యాత మెడికల్ డివైజెస్ తయారీ కంపెనీ కన్ ఫ్లూయెంట్ మెడికల్ (Confluent Medical) సంస్థ హైదరాబాద్ లో తన తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. కన్ఫ్ల్యూయెంట్ మెడికల్ సంస్థ అధ్యక్షులు, సీఈవో డీన్ షావర్ తో శాన్ హో నగరంలో సమావేశమయ్యారు.
త్వరలో పైలట్ ప్రాతిపదికన ఒక తయారీ యూనిట్ ని మొదలుపెట్టి 12 నెలల్లో దాన్ని భారీగా విస్తరించేందుకు
కన్ ఫ్లూయెంట్ మెడికల్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. కంపెనీ నింతోల్ ఉత్పత్తుల తయారీ కోసం అగ్రశ్రేణి సాంకేతిక పరిజ్ఞానాన్ని హైదరాబాద్ నగరానికి తీసుకురానుందన్న కేటీఆర్…దేశంలో ఈ స్థాయి టెక్నాలజీతో ఉత్పత్తులను తయారు చేసే మొదటి కంపెనీగా నిలవనుందన్నారు.
అంటే దేశంలోని మెడికల్ డివైజెస్ తయారీ కంపెనీలకు తన ఉత్పత్తుల ఆధారంగా సేవలను అందించనుంది. భారత్ తోపాటు ఆసియా ఖండంలోని తన ఖాతాదారులకు తన ఉత్పత్తులను సరఫరా చేయనుంది.
“భారతదేశానికి తొలిసారిగా అత్యంత ఆధునాతన టెక్నాలజీ ని తీసుకురావాలన్న లక్ష్యంతో హైదరాబాద్ నగరాన్ని తమ గమ్యస్థానంగా ఎంచుకున్నాం. భవిష్యత్తులో తమ కంపెనీని భారీగా విస్తరించే ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయి. త్వరలోనే తమ కంపెనీ బయోమెడికల్ టెక్స్టైల్ సేవలకు సంబంధించి ప్రణాళికలను ప్రకటిస్తాం” అని సంస్థ సీఈవో డీన్ షావర్
అన్నారు.
https://twitter.com/MinisterKTR/status/1506855606246076419?s=20&t=fJl2jRyD_hFUi-cYN5HCLQ
తమ తయారీ యూనిట్ ఏర్పాటు కోసం హైదరాబాద్ నగరాన్ని ఎంచుకున్న కన్ ఫ్లూయెంట్ మెడికల్ టెక్నాలజీ సంస్థకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సంస్థ తయారీ ప్లాంట్ యూనిట్ కి సంబంధించి అన్ని రకాల సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందిస్తామని.. భవిష్యత్తులో సంస్థతో తెలంగాణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పని చేద్దామని చెప్పారు. కేటీఆర్ తో పాటు..పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయెష్ రంజన్, డైరెక్టర్ లైఫ్ సైన్సెస్ శక్తి నాగప్పన్ సమావేశంలో పాల్గొన్నారు.