తెలంగాణాలో రాజకీయాలు వేడెక్కాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ బీజేపీ నాయకులపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ నాయకులను, ప్రధాని మోదీ ని, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందంటూ ప్రశ్నిస్తూ, రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లిన పన్నుల లెక్కలను చెప్పారు.
కేటీఆర్ మాట్లాడుతూ, “రాసుకోండి రాష్ట్ర మంత్రిగా, సాధికారంగా అధికారిక లెక్కలు చెప్తున్నా.. తప్పైతే నా మంత్రి పదవి తీసి ఎడమ కాలి చెప్పులా పడేస్తా. రాష్ట్రం సాధించిన ఈ ఏడున్నర ఏళ్లలో తెలంగాణ ప్రజలు తమ రక్తం, చెమట దారబోసి 3,65,797 కోట్లు కేంద్రానికి పన్నుల రూపంలో కడితే మనకు తిరిగి వచ్చిన మొత్తం 1,68,647 కోట్లు మాత్రమే. మన రాష్ట్రం నుంచి 2 లక్షల కోట్లు వారికి వెళ్లాయి, ఆ మొత్తం ఎక్కడికెళ్ళాయో చెప్పాలా అంటూ.. యూపీలో వాడెవడో యోగి అంట, వాడు అక్కడ బుల్డోజర్లను పెట్టి ఇల్లు కూల్చేస్తున్నాడు, ఆ బుల్డోజర్లకు మన డబ్బులు వెళ్లాయి. ఇంకా వెనుక పడ్డ యూపీ, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో తెలంగాణ బిడ్డల చెమట, రక్తం అక్కడ ఉంది. ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులకు చెప్తున్నా.. సిగ్గు తెచ్చుకోండి, జ్ఞానం తెచ్చుకోండి, చదువుకోండి. దమ్ముంటే నేను చెప్పింది తప్పని ఏ బీజేపీ నాయకుడినైనా రుజువు చేయమనండి.. నేను చెప్పిన గణాంకాలు తప్పైతే నా మంత్రి పదవి వదిలేసి సాధారణ ఎమ్మెల్యే గా కొనసాగుతా” అని అన్నారు.
“రాష్ట్రంలో ఎన్నికైన నలుగురు బీజేపీ ఎంపీలు కూడా చిల్లరగాళ్లు. నిజామాబాద్ ఎంపీ ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పి మోసం చేశాడు. బూతులు తప్ప ఏం మాట్లాడడు. ఆదిలాబాద్ ఎంపీ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెరిపిస్తానని చెప్పి, అడ్రస్ లేకుండా పోయాడు. సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి.. ప్రపంచంలోనే అతిపెద్దదైన సంప్రదాయ మెడిసిన్లకు సంబంధించిన గ్లోబల్ సెంటర్ను హైదరాబాద్లో పెడుతామని చెప్పిండు.. కానీ నరేంద్ర మోదీ ఆ సంస్థను గుజరాత్లోని జామ్ నగర్కు తరలించాడు” అని తెలిపారు.
దీనిపై నెటిజన్లు స్పందిస్తూ, మీరు రాష్ట్రం నుంచి పంపిన డబ్బు ను మొత్తం మీకే పంపేలా అయితే మీరు పంపడం ఎందుకు, కేంద్రం దేశ రక్షణ కొరకై ఆర్మీని నిర్వహించడానికి డబ్బులు కేటాయిస్తారు. కేంద్రపాలిత ప్రాంతాల నిర్వహణ కోసం ఉపయోగిస్తారు. సైన్యానికి కావాల్సిన యంత్రాలను రూపొందించడనికై డబ్బులు కేటాయిస్తారు. దేశ సరిహద్దు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం కేటాయిస్తారు. దేశంలో మొత్తం ప్రత్యేక కేటగిరీ హోదాలో 11 వెనుకబడిన రాష్ట్రాలు ఉన్నాయి, వాటి నిర్వాహణకు ఉపయోగిస్తారు. రాష్ట్ర డబ్బులు దేశం కోసం వాడుతున్నారు తప్ప బీజేపీ రాష్ట్రాల కోసం కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)