కోవిడ్-19 కట్టడిలో యునైటెడ్ స్టేట్స్తో పోలిస్తే ఉత్తరప్రదేశ్ మెరుగ్గా ఉందని బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్(BMGF) తెలిపింది. ఆరోగ్యం, పోషకాహారం సహా వ్యవసాయ రంగాలలో సాంకేతిక సహకారాన్ని పెంచే మార్గాలను చర్చించడానికి BMGF ప్రతినిధి బృందం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో గురువారం సమావేశమైంది.
“మేం పని చేసే అనేక దేశాలలో కోవిడ్ నిర్వహణను గమనించాం. కోవిడ్ నిర్వహణలో యునైటెడ్ స్టేట్స్ కంటే కూడా భారతదేశం అందులో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ చాలా మెరుగ్గా ఉందని చెప్పడం న్యాయమే” అని BMGF CEO మార్క్ సుజ్మాన్ అన్నారు.
నిరుపేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంలో ఫౌండేషన్ కీలక పాత్ర పోషించిందని సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. నోయిడా, గోండా సహా ప్రయాగ్రాజ్లలో కోవిడ్ ఆసుపత్రుల స్థాపన తోపాటు కోవిడ్ను ఎదుర్కోవడంలో యూపీ ప్రభుత్వం ఫౌండేషన్ నుంచి సహకారం పొందింది” అని ఆయన అన్నారు. పిల్లల్లో మెదడువాపు సంబంధిత మరణాలలో 95 శాతం నివారించామని అన్నారు. ఉత్తరప్రదేశ్లో ఆరోగ్య భద్రత అంశంపై ఇంకా ఎక్కువ పని చేయాల్సి ఉంది, అందువల్ల వైద్యుల కొరత లేకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తోంది.
తాజా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 (NFHS-5) ఫలితాల్లో రాష్ట్రం ఆరోగ్యం, పోషకాహార రంగంలో అద్భుతమైన అభివృద్ధిని కనబరుస్తుందని సీఎం యోగి సమావేశంలో తెలిపారు.
సీఈఓ మార్క్స్ సుజ్మాన్ నేతృత్వంలోని BMGF బృందం గర్భిణీ స్త్రీలు, నవజాత శిశువులకు అందించే సేవలను అంచనా వేయడానికి లక్నోలోని అవంతీబాయి (మహిళల) ఆసుపత్రిని సందర్శించింది. ఆసుపత్రి చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ సీమా శ్రీవాస్తవ ప్రకారం, ప్రతినిధి బృందం వైద్య సిబ్బందితో మాట్లాడి సేవలను పరిశీలించింది.