‘ఇంటి నుంచి బయటకు వెళ్లినోడు వ్యక్తి తిరిగి క్షేమంగా వస్తడని గ్యారంటీ ఏది?.. ఈ ప్రపంచంలో పూర్తి స్థాయి భద్రత ఇచ్చే దేశం ఉందా?’
‘మన దేశంలో అయితే కష్టం.. అమెరికా ఒక్కటే మోస్ట్ సేఫ్టీ కంట్రీ..’
ఇద్దరు మిత్రులు సీరియస్గా చర్చిస్తున్నారు.. మధ్యలో నేను జోక్యం చేసుకున్నాను..
‘భద్రమైన చోటు పలానా దేశం అని ఎలా గ్యారంటీ ఇ’స్తాం?.. ప్రపంచం ఇవాళ ఎదుర్కొంటున్న తీవ్రవాద సమస్యకు మూలం ఎక్కడ అంటే అందరూ అమెరికా వైపే వేళెత్తి చూపిస్తున్నారు.. ఇలా అందరి ఉసురు పోసుకున్న అమెరికా భద్రమైన దేశమనే గ్యారంటీ ఏంటీ?..’
అంతేనంటావా అని మొదటి మిత్రుడు నా సమాధానంతో ఏకీభవించాడు.. రెండో వాడు మాత్రం విబేధించాడు.. అతడు అప్పటికే డాలర్ డ్రీమ్స్లో ఉన్నాడు.. మన దేశంలో అప్పటికే తరచూ బాంబు పేలుళ్లు, తీవ్రవాద ఘటనలు జరగడాన్ని ప్రస్థావించేవాడు.. కొద్ది రోజులకు వాడు తన కలలు సాకారం చేసుకొని అమెరికా వెళ్లిపోయాడు..
2001 సెప్టెంబర్ 11.. ప్రపంచమంతా ఉలిక్కిపడ్డ రోజు.. అమెరికన్లు నిలువునా వణికిపోయారు.. న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్లు మీద, రక్షణ శాఖ కేంద్రం పెంటగాన్ మీద అల్ఖైదా ఉగ్రవాదులు విమానాలతో దాడులు చేశారు.. మరిన్ని దాడు జరిగే ప్రమాదం ఉందని అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ సహా అందరూ కొద్ది గంటల పాటు అందోళనకు గురయ్యారు..
ప్రమాదం తమ గడపలోకి వచ్చాక కానీ అమెరికా కళ్లు తెరవలేదు.. ఉగ్రవాదంపై దాడికి ఏకం కావాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. కానీ ఉగ్రవాద కర్మాగారం పాకిస్తాన్ను పక్కలో పెట్టుకుంది.. బిన్లాడెన్కు ఆశ్రయం ఇచ్చిన తాలిబన్ల మీద పగబట్టింది.. ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది. చివరకు బిన్ లాడెన్ను పాకిస్తాన్లోనే గుర్తించి మట్టుబెట్టింది.. 20 ఏళ్ల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ను మళ్లీ తాలిబన్ల చేతిలోనే పెట్టి చేతులు దులుపుకొని వెళ్లిపోయింది అమెరికా..
ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదానికి ఊపిరి పోసింది ఎవరు? అమెరికా, రష్యాల ఆధిపత్య పోరు కాదా? ఇద్దరూ దొందు దొందే.. తమ స్వార్థ ప్రయోజనాల కోసం సాగించిన యుద్ధానికి ప్రపంచం మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది.. అమెరికాకు ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే చిత్తశుద్ది నిజంగా ఉంటే, ఆప్ఘన్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్రవాదులను కూడా ఏరివేయాల్సింది.. అలా చేయకపోవడం వల్లే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. పాకిస్తాన్ సహకారంతో తాలిబన్లు మళ్లీ ఆప్ఘనిస్తాన్లో అరాచకాలు మొదలు పెట్టారు..
చివరగా.. అమెరికాలోని నా మిత్రునికి 20 ఏళ్ల క్రితమే జ్ఙానోదయమైంది.. నేను చెప్పిందే కరెక్టని అంగీకరించాడు.. అక్కడ బాగానే సంపాదించకున్నా మాతృ దేశం మీద ప్రేమ పెరిగింది..
-క్రాంతిదేవ్ మిత్రా