కొత్త మంత్రివర్గం కొలువుదీరిన వేళ ఏపీలో అసంతృప్తి జ్వాలలూ ఎగిసిపడుతున్నాయి. తమను కొనసాగించకపోవడంపై పలువురు, మంత్రి పదవి ఈసారి కూడా ఇవ్వనందుకు మరికొందరు అలకబూనారు. మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత ఏకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన అందర్నీ కొనసాగిస్తూ తనపై వేటు వేయడాన్ని ఆమె అవమానంగా భావిస్తున్నారు. ఆదివారం రాత్రి పార్టీ కార్యకర్తలు, ఆమె అనుచరులు జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆమెను బుజ్జగించేందుకు వెళ్లిన ఎంపీ మోపిదేవి చేతికి తన రాజీనామా లేఖను ఇచ్చారు సుచరిత. మోపీదేవి అక్కడ ఉండగానే ఆమె అనుచరులు మళ్లీ జగన్ కు, విజయసాయికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇక సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. మంత్రి పదవి దక్కదని తెలిసినప్పటినుంచీ ఆయన పార్టీపై, నాయకుడిపై రగిలిపోతున్నారట. బాలినేని అజ్ఞాతంలోకి వెళ్లారని చెబుతున్నారు. ఇక బాలినేనికి మద్దతుగా జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు ఆందోళనలు నిర్వహించారు. ఆయన మద్దతుదారు ఎమ్మెల్యే అన్నా రాంబాబు సైతం రాజీనామాకు సిద్ధమైనట్టు తెలిసింది.
మరో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యే అయిన తనకు ప్రాధాన్యం దక్కకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు మంత్రిపదవి దక్కకపోవడంపై ఆయన అనుచరులూ అసంతృప్తితో ఉన్నారు. సామినేనికి మద్దతుగా జగ్గయ్యపేట మున్సిపల్ వైస్ ఛైర్మన్ తో పాటు కౌన్సిలర్లు కూడా రాజీనామాకు సిద్ధమయ్యారు.
అసంతృప్తివాదుల్లో చాలా మంది జగన్ కంటే ఆయన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన డైరెక్షన్లో కొత్త టీం తయారుచేసుకుంటున్నారని తాజా కూర్పే అందుకు నిదర్శమని ఆరోపిస్తున్నారు. సజ్జల తీరు వల్ల ఇప్పటికిప్పుడు కాకున్నా జగన్ కు భవిష్యత్తులో తిప్పలు తప్పవని పార్టీ వాళ్లే చెవులు కొరుక్కుంటున్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)