ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో ఆయన కాషాయకండువా కప్పుకున్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కిరణ్ కుమార్ రెడ్డి..2004-09 మధ్య అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్గా, 2009-10లో అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారు. 2010-2014 కాలంలో అంటే తెలంగాణ ఏర్పడే వరకు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఆయన రాష్ట్ర విభజనను వ్యతిరేకించారు. పార్టీకి రాజీనామా సైతంచేశారు. అనంతరం సమైక్యాంధ్ర పార్టీ అని పెట్టి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం తిరిగి కాంగ్రెస్ లో చేరారు. అయితే ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల తరువాత క్రియాశీలక రాజకీయాలకు కిరణ్ కుమార్ రెడ్డి దూరంగా ఉన్నారు. కొన్నిరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన ఇవాళ బీజేపీలో చేరారు.