దేశం కోసం ప్రాణాలు అర్పించిన విప్లవకారుడు ఖుదీరాం బోస్. 1908లో సరిగ్గా ఇదే రోజు బ్రిటీష్ సర్కారు ఆయన్ని ఉరితీసింది. రికార్డుల ప్రకారం స్వరాజ్య పోరులో ఉరిశిక్ష పడిన అతి చిన్న వయస్కుడు ఖుదీరాం. దేశమాత దాస్యశృంఖలాల్ని తెంచేక్రమంలో ఉరికంబాన్ని ముద్దాడినప్పుడు ఆయన వయసు సరిగ్గా 18 సంవత్సరాల 8 నెలలు. బ్రిటీష్ వాళ్లను ఎదిరించి… చేతిలో భగవద్గీత పట్టుకుని సంతోషంగా శిక్షను అనుభవించాడు.
పశ్చిమ బెంగాల్లోని మిడ్నాపూర్ జిల్లాలో 1889 డిసెంబర్ 3 న జన్మించిన ఖుదీరాం బోస్..చిన్నవయసులోనే కన్నవాళ్లను కోల్పోయాడు. సోదరి సంరక్షణలో పెరిగాడు. మిడ్నాపూర్లో అరబిందులు, సోదరి నివేదిత చేసిన ప్రసంగాలకు ఆకర్షితుడై స్వాతంత్ర్యోద్యమంలో చేరాడు. 15 ఏళ్ల చిరుప్రాయంలోనే అనుశీలన్ సమితి వాలంటీర్ గా బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా కరపత్రాలు పంచుతూ అరెస్టయ్యాడు. 18 ఏళ్ల వయసులో చీఫ్ జడ్జి గ్లాస్ కింగ్ఫోర్డ్ను హత్య చేయాలని పథకం పన్నారు….ఖుదీరాం బోస్, ప్రఫుల్లా చాకీ. . ఏప్రిల్ 30 న కింగ్ ఫోర్ట్ పై దాడి చేయాల్సి ఉండగా పొరపాటున న్యాయవాది కెన్నడీపై బాంబులు విసిరారు. ఆ ఘటనలో కెన్నడీ భార్య చనిపోయింది.
పోలీసులకు దొరక్కుండా పారిపోతూ….ప్రఫుల్లా తనకు తాను కాల్చుకుని చనిపోగా…. ఖుదీరాం బోస్ పోలీసులకు పట్టుబడ్డాడు. విచారించిన కోర్టు ఆయనకు ఉరిశిక్ష విధించింది. ముజఫ్పర్పూర్ జైలులో ఆగస్ట్ 11 న నవ్వుతూ ఉరికంబం ఎక్కాడు. స్వాతంత్ర్యానంతరం ముజఫర్ పూర్ జైలుకు ఖుదీరాంబోస్ స్మారక కేంద్ర కారాగారంగా నామకరణం చేశారు. ఆయన పట్టుబడిన రైల్వే స్టేషన్కూ ఆయన పేరు పెట్టారు.
ఖుదీరాంబోస్ వంటి ఎందరో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. సమిధలయ్యారు. అయితే ఇలాంటి యోధులనెందరినో చరిత్ర విస్మరించింది. అయితే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఖుదీరాం బోస్ వంటి అమరుల త్యాగాలను గుర్తిస్తోంది. గతేడాది హోంమంత్రి అమిత్షా స్వయంగా ఖుదీరాంబోస్ ఇంటికి వెళ్లారు.
3వ తరం కుటుంబీకుడైన 80ఏళ్ల వయసున్న గోపాల్ బోస్ ను కలిశారు. సాక్షాత్తూ కేంద్ర హోంమంత్రి ఇంటికిరావడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. ఖుదీరాంబోస్ ఇంటిని సందర్శించడం ద్వారా బోస్ త్యాగమయ జీవితం గురించి ఈ తరానికీ తెలిసివచ్చింది.