ప్రతీ సంవత్సరం శ్రీ సరస్వతీ విద్యాపీఠం లో ఆటల పోటీలు నిర్వహించటం ఆనవాయితీ. ఈ ఏడాది పోటీలకు శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం చొక్కా రాంనగర్ (రాంపూర్) వేదికగా నిలిచింది. మూడు రోజులు పాటు జరిగిన పోటీలలో వివిధ క్రీడలలో స్పర్థలు నిర్వహించారు. ఇందులో తెలంగాణ లోని వివిధ జిల్లాలకు చెందిన అనేక పాఠశాలల విద్యార్థులు తమ ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడా స్ఫూర్తిని పెంపొందించు కునేందుకు ఈ పోటీలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. పిల్లలంతా మూడు రోజులపాటు సందడిగా ఆటల పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లలు వెంట వచ్చిన ఆచార్యులు మాతాజీలు ఈ క్రీడా పోటీలను పండుగ గా మార్చేశారు.
ముగింపు కార్యక్రమములో విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర అధ్యక్షులు మాన్యశ్రీ డాక్టర్ చామర్తి ఉమామహేశ్వర రావు మార్గదర్శనం చేసారు .క్రీడల ద్వారా చక్కటి వ్యక్తిత్వ వికాసము పెరుగుతుంది అని చెప్పారు. జీవితంలో గెలవాలి అన్న భావన , పట్టుదల, ఖచ్చితత్వం, నిర్మాణము అవుతుంది అని వివరించారు. అలాగే జట్టు పోటీలు ద్వారా సామూహికంగా మనమంతా ఒక్కటే అన్న భావన కలుగుతుంది. విద్యార్థులకు సామాజిక శక్తి నిర్మాణము అవుతుంది అని తెలుస్తుంది. అంతిమంగా ఒక సకారాత్మక భావన నిర్మాణము అవుతుంది అని డాక్టర్ ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు .
ఆటల పోటీలను మొదటగా శ్రీ సరస్వతి విద్యాపీఠం తెలంగాణ రాష్ట్ర సంఘటన మంత్రి పతకమూరి శ్రీనివాసరావు ప్రారంభించారు. విద్యార్థులకు ఆటల పోటీలతో ఉత్సాహం, ఉల్లాసం పెరుగుతోంది అని అన్నారు. పిల్లల్లో పోటీతత్వం బాగా పెరుగుతుంది అని వివరించారు. శ్రీ సరస్వతి విద్యాపీఠం మొదటి నుంచి చదువులతో పాటు ఆటపాటలు కూడా పెద్దపీట వేస్తుంది అని ఆయన గుర్తు చేశారు. ముగింపు సందర్భంగా విజేతలకు పతకాలు ప్రదానము చేశారు.
ఈ పోటీలను మూడు రోజులు పాటు శ్రీ సరస్వతీ విద్యాపీఠం ప్రాంత కార్యదర్శి ముక్కాల సీతారాములు, శైక్షణిక్ ప్రముఖ్ కృష్ణమాచార్యులు, ఖేల్ కూద్ ప్రముఖ్ భీమ్ సేన్ పర్యవేక్షించారు. ఆవాస విద్యాలయం ఉపాధ్యక్షులు పూసుకూరి శ్రీనివాస రావు, ఆవాస విద్యాలయం కార్యదర్శి సాగి ప్రభాకర రావు , ప్రధానాచార్యులు రామన్న ఈ పోటీలను సమన్వయం చేశారు.