మధ్యప్రదేశ్ ఖర్గోన్ హింస ఘటనలో 64 కేసులు పెట్టిన పోలీసులు 175 మందిని అరెస్ట్ చేశారు. శ్రీరామనవమి సందర్భంగా ఓవర్గం శోబాయాత్రపై రాళ్లు రువ్విన సంగతి తెలిసిందే. తరువాత చెలరేగిన అల్లర్లలో దుండగులు ఇళ్లు, వాహనాలు తగులబెట్టారు. ఇక అక్కడ ప్రశాంత పరిస్థితులు నెలకొంటున్నాయి. కర్ఫ్యూను కొద్దికొద్దిగా సడలిస్తున్నారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కర్ఫ్యూను సడలించారు.
ఖర్గోన్ పోలీసు సూపరింటెండెంట్ సిద్ధార్థ్ చౌదరిపై కాల్పులు జరిపిన కేసులో నిందితుడు మొహిసిన్ వురపు వసీమ్ను శనివారం కోర్టులో హాజరుపరచారు. మూడు రోజులపాటు పోలీసు రిమాండ్కు తరలించారు. విచారణ కొనసాగుతోందని…సాక్ష్యాధారాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నాటి హింసాకాండలో పదుల సంఖ్యలో ఇళ్లు, వాహనాలు తగులబెట్టారు. పోలీస్ అధికారి సిద్ధార్థ్ చౌదరిపై ఓ దుండగుడు కాల్పులు జరపడంతో ఆయన కాలికి గాయమైంది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.