హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ మెయిన్ గేట్ పై ఖలిస్థాన్ జెండాలు ప్రత్యక్షమవడం కలకలం రేపుతోంది. ఏకంగా అసెంబ్లీ మెయిన్ గేట్ పైనే ఖలిస్థాన్ జెండాలు కట్టడం దుమారం తీవ్ర రేపుతోంది. ఈ జెండాలను పెట్టింది ఎవరో తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మెయిన్ గేట్ పై జెండాల తోపాటు గోడపై ఖలిస్థాన్ అనుకూల గ్రాఫిటీని కూడా చిత్రీకరించారు.
సాధారణంగా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ధర్మశాలలో, ఇతర సమావేశాలు సిమ్లాలోని అసెంబ్లీలో జరుగుతాయి. ప్రస్తుతం అక్కడ అసెంబ్లీ సమావేశాలు జరగట్లేదు.
శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ తెలిపారు. ఘటనపై త్వరగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
“ధర్మశాల అసెంబ్లీ కాంప్లెక్స్ గేటు వద్ద రాత్రిపూట ‘ఖలిస్తాన్’ జెండాలను ఎగురవేసిన పిరికిపంద చర్యను నేను ఖండిస్తున్నాను” అని శ్రీ ఠాకూర్ ఒక ట్వీట్లో పేర్కొన్నారు. ఈ (ధర్మశాల) అసెంబ్లీలో శీతాకాల సమావేశాలు మాత్రమే జరుగుతున్నందున, ఆ సమయంలో అదనపు భద్రతా ఏర్పాట్లు అవసరం అని ఆయన అన్నారు. ప్రస్తుతం భద్రతా తక్కువగా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఈ పిరికిపంద చర్యకు పాల్పడ్డారు, అయితే మేం దీన్ని సహించబోం. ఈ ఘటనపై త్వరగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. మీకు ధైర్యం ఉంటే రాత్రిపూట కాకుండా పగటిపూట బయటకు రండి అని నేను వారికి చెప్పాలనుకుంటున్నా” అని హెచ్చరించారు.
ఉదంతం మెయిన్ గేట్ పై ఖలిస్థాన్ జెండాలను గుర్తించిన వెంటనే వాటిని తొలగించామన్నారు ఎస్పీ కుషాల్ శర్మ. పంజాబ్ కు చెందిన పర్యాటకులీ ఈ చర్యకు పాల్పడ్డారని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
రాష్ట్ర రాజధాని సిమ్లాలో ఖలిస్థాన్ జెండాలు ఎగురవేయాలని సిఖ్స్ ఫర్ జస్టిస్ నాయకుడు గురుపత్వంత్ సింగ్ గత నెలలో పిలుపునిచ్చారు. గురుపత్వంత్ వ్యాఖ్యలపై యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ అఫ్ ఇండియా సిమ్లాలోని డిప్యూటీ కమీషనర్ కార్యాలయం బయట ఖలిస్థాన్ జెండాలను కాల్చివేశారు.