ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో సహా ఉపఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలపై బీజేపీ దృష్టి సారించింది. పశ్చిమ బెంగాల్, అస్సాం, మధ్యప్రదేశ్ తో పాటు బీజేపీకి కీలకంగా ఉండే రాష్ట్రాల్లో కాషాయం జెండా ఎగురవేసేందుకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పలు మార్పులకు నాందిపలికారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు బీజేపీ ఇన్చార్జిలను మార్చారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులకు, కార్యదర్శులకు బాధ్యతలు అప్పగిస్తూ జేపీ నడ్డా నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక సహా ఇన్చార్జీగా డీకే అరుణకు బాధ్యతలు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇన్చార్జీగా మురళీధర్ను నియమించారు. సహా ఇన్చార్జిగా సునీల్ దేవధర్ను కొనసాగనున్నారు. తెలంగాణకు ఇన్చార్జిగా తరుణ్ ఛుగ్ కు బాధ్యతలు అప్పగించారు. కొత్తగా పార్టీ ప్రధానకార్యదర్శి పదవిని చేపట్టిన పురందేశ్వరికి ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల బాధ్యతను అప్పగించారు. హోమ్ మంత్రి అమిత్ షాకు సన్నిహితుడుగా ఉండే మురళీధరరావును మధ్యప్రదేశ్ ఇన్చార్జిగా నియమించారు. రామ్ మాధవ్ ను మణిపూర్, జమ్మూకాశ్మీర్ కు, బైజయంత్ జై ను అస్సాంకు, సీటీ రవిని మహారాష్ట్ర, గోవా, తమిళనాడు రాష్ట్రాలకు ఇన్చార్జిలుగా నియమించారు. దుశ్యంత్ గౌతమ్ కు పంజాబ్, చండీగఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల బాధ్యతను అప్పగించారు. పశ్చిమ బెంగాల్ పార్టీ వ్యవహారాల్లో విజయ్ కైలాష్ వర్గీయకు పార్టీ సమాచార, టెక్నాలజీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ సహకరించనున్నారు. బీహార్ రాష్ట్రానికి భూపేంద్ర యాదవ్ ను నియమించారు. ఆయన గుజరాత్ పార్టీ వ్యవహారాలను కూడా చూస్తారు. యూపీ ఇన్చార్జిగా రాధామోహన్ సింగ్ కు సునీల్ ఓఝా, సంజీవ్ చౌరాసియా సహకరిస్తారు. రాధామోహన్ సింగ్ రాజస్థాన్ పార్టీ వ్యవహారాలను కూడా పర్యవేక్షిస్తారు. ఉత్తరప్రదేశ్ కో ఇన్చార్జి,అండమాన్ నికోబార్ ఇన్చార్జిగా సత్యకుమార్ను నియమించింది. తమిళనాడు కో ఇన్చార్జిగా పొంగులేటి సుధాకర్రెడ్డికి బిజెపి అధిష్టానం బాధ్యతలు అప్పగించింది.