భారత రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో తన పదవికి రాజీనామా చేశారు కేరళ మంత్రి సాజీ చెరియన్. పతినంతిట్ట జిల్లా మల్లపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో భారత రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు మంత్రి… అందంగా రాసుకున్న రాజ్యాంగం మనదని చెప్పుకుంటున్నాంకానీ…ఈ దేశ రాజ్యాంగం అత్యధిక ప్రజల్ని దోచుకునేలా రాశారని నేనంటాను అని అన్నారు చెరియన్. దీంతో ఆయన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. విపక్షాలు విమర్శలు గుప్పించాయి. దీంతో ఆయన పదవికి రిజైన్ చేశారు. రాజీనామా తన వ్యక్తిగత విషయమని… తాను రాజ్యాంగాన్ని అవమానించలేదని… తన మాటల్ని మీడియా వక్రీకరించిందనీ వాపోయారు. చెరియన్ విజయన్ కేబినెట్లో మత్య్సశాఖను చూసేవారు.
బ్రిటీష్ పాలకులు సిద్ధం చేసిన దాన్నే మనవాళ్లు రాశారని…75 ఏళ్లుగా దాన్నే అమలు చేస్తున్నారని తాను అన్నానని… రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం వంటి మంచి అంశాలున్నా…వాటి లక్ష్యం నెరవేరడం లేదని..సామాన్యులు దోపిడీకి గురవుతున్నారన్నది తన వ్యాఖ్యల ఉద్దేశమని చెప్పుకొచ్చారు చెరియన్.
చెరియన్ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. బీజేపీ నేతృత్వంలో విపక్ష పార్టీలు అసెంబ్లీ వెలుపల ప్లకార్డులతో నిరసనకు దిగారు. మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన రాజీనామా చేయక తప్పలేదు.