కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్ తెలిపిన వివరాల ప్రకారం, మరో నిందితుడు పీఎస్ సరిత్ను బుధవారం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. తనకు ప్రాణహాని ఉందని మీడియాకు చెప్పడంతో బుధవారం ఉదయం స్వప్న సురేష్ ఇంటి నుంచి సరిత్ను కిడ్నాప్ చేశారు. ఈ ఉదయం తన విలేకరుల సమావేశం ముగిసిన కొద్ది నిమిషాలకే కిడ్నాప్ జరిగిందని ఆమె చెప్పారు.
ఇంతకుముందు బెదిరింపులే వచ్చేవని..ఇప్పుడు దాడులు మొదలయ్యాయని వాపోయారు.. HRDS ఇండియా సిబ్బంది అయిన సరిత్ను నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు తనింటి నుంచి బలవంతంగా కిడ్నాప్ చేశారని స్వప్న తెలిపారు.. విజిలెన్స్ అధికారులమని చెప్పి సరిత్ను తీసుకెళ్లారని, అయితే వారు తమ గుర్తింపు కార్డులు చూపించలేదనీ ఆమె అన్నారు.
ఈ కిడ్నాప్ దానికి సంకేతమని ఆమె ప్రశ్నించారు.
సరిత్ ను రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారనే ఆరోపణల గురించి అడిగినప్పుడు, అతని న్యాయవాది అతని విముక్తి కోసం హెబియస్ కార్పస్ పిటిషన్ను దాఖలు చేయడంతో సహా చట్టపరమైన చర్యలను ఇప్పటికే ప్రారంభించారని ఆమె చెప్పారు.
కేరళ సీఎం పినరయి విజయన్, ఆయన కుటుంబంపై స్వప్న తీవ్ర ఆరోపణలు చేయడం గమనార్హం. సెక్షన్ 164 కింద తన రహస్య వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు స్వప్న సురేష్ కొచ్చిలోని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లింది. 2016లో సీఎం విజయన్ దుబాయ్లో ఉన్నప్పుడు డబ్బుతో కూడిన బ్యాగ్ను ఆయనకు ఇచ్చారని మంగళవారం తన వాంగ్మూలం తర్వాత స్వప్న విలేకరులతో అన్నారు.
బంగారు అక్రమ రవాణా కుంభకోణంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తోపాటు ఆయన మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం శివశంకర్, సీఎం భార్య కమల, కుమార్తె వీణ, ఆయన అదనపు ప్రైవేట్ సెక్రటరీ సీఎం రవీంద్రన్, మాజీ బ్యూరోక్రాట్ నళిని నెట్టో, మాజీ మంత్రి కె టి జలీల్ ప్రమేయం ఉందని స్వప్న కోర్టుకు తెలియజేశారు.
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ స్కామ్
తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో 2020 జూలై 5న కస్టమ్స్ అధికారులు 30 కిలోల కంటే ఎక్కువ బరువున్న దాదాపు రూ.15 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని దౌత్య సామానులో దాచిపెట్టి, యూఏఈ దౌత్యకార్యాలయానికి విమానంలో రవాణా చేశారు. స్మగ్లింగ్ నెట్వర్క్లో బంగారం భాగమని ఆధారాలు లభించిన తర్వాత కస్టమ్స్ అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఈ కేసులో స్వప్న సురేష్ ప్రధాన నిందితురాలు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ పర్యవేక్షిస్తున్న కేరళ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ కోసం ఒక ప్రాజెక్ట్లో పనిచేయడానికి ఒక ప్రైవేట్ కంపెనీ UAE కాన్సులేట్ మాజీ ఉద్యోగిని స్వప్న సురేష్ని నియమించుకుంది. గతంలో ఈ శాఖకు సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం శివశంకర్ బాధ్యతలు నిర్వహించారు.
బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ తోపాటు ముగ్గురు మంత్రివర్గ సభ్యులపై స్వప్న సురేష్ ఇప్పటికే తీవ్ర ఆరోపణలు చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ 2017లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) కాన్సుల్ జనరల్తో చాలా సార్లు సమావేశమయ్యారని సురేశ్ 2020 అక్టోబర్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి తెలిపారు.