డిల్లీలోని ఆప్ ప్రభుత్వం ప్రతిపాదించిన విశ్వాసతీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆపరేషన్ లోటస్ విఫలమైందని కేజ్రీవాల్ అన్నారు. తమ పార్టీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీకి అమ్ముడుపోలేదని నిరూపించేందుకు విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని సీఎం తెలిపారు. 20 కోట్లు ఇవ్వచూపినా తమ వాళ్లు ఒక్కరు కూడా అమ్ముడుపోలేదన్నారు. అటు అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టడంపై బీజేపీ నేత అమిత్ వాలవీయ ఆసక్తికర ట్వీట్ చేశారు. అసలు విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టమని ఎవరు అడిగారని నిలదీశారు.
లిక్కర్ పాలసీ, ఎడ్యుకేషన్ కుంభకోణాల నుంచి తప్పుదారి పట్టించేందుకే విశ్వాస తీర్మానం తెచ్చారని ఆరోపించారు. అది విశ్వాస తీర్మానం కాదని… హెడ్లైన్స్లో లిక్కర్ స్కామ్ వార్తలు చోటుచేసుకోకుండా చేసేందుకు ప్రవేశపెట్టిన ‘మేడ్ ఫర్ మీడియా కాన్ఫిడెన్స్ మోషన్” ఇదని వెస్ట్ ఢిల్లీ ఎంపీ పర్వేష్ వర్మ అన్నారు. ”స్కామ్స్టర్తో కలిసి మీడియా ఉంటుందా? ఆయన అవకాశవాదాన్ని ఎండగట్టే పాత్ర పోషిస్తుందా? ఆయనకు ఎలాంటి విశ్వసనీయత లేదు. మీడియాకు ఉందని మాత్రం బలంగా నమ్ముతున్నాను” అని ట్వీట్ చేశారు.