కేజ్రీవాల్ రైతుద్రోహం
అవినీతి వ్యతిరేక ఉద్యమంలోంచి పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. అభివృద్ధి చేతగాక, ఉచిత తాయిలాలతో గెలవడం మంచిదనుకుంది. ఇప్పుడు ఢిల్లీ శివార్లలో జరుగుతున్న ఆందోళన అనే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఆప్ సర్కార్ కొండంత అండగా నిలిచింది. ఉచితంగా వైఫై అందించబోతున్నది. పంజాబ్ నుంచి వచ్చిన రైతులకు, కమీషన్ ఏజెంట్ల మనుషులకు అరవింద్ కేజ్రీవాల్ చేసిన దగా గురించి తెలిసినట్టు లేదు.
మూడేళ్ల కిందట జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము రైతులకు ఇచ్చిన హామీని కేజ్రీవాల్ చాలా కన్వీనియంట్ గా మర్చిపోయినట్టున్నాడు. వ్యవసాయ మార్కెట్లకు ప్రయివేటు రంగ బలాన్ని సమకూరుస్తాం. మార్కెట్లో భారీ ఎత్తున ప్రయివేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తాం. రైతులు పంట ఉత్పత్తులు అమ్ముకోవడానికి వసతులు కల్పిస్తాం. ప్రతి జిల్లాలో ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేయిస్తాం. రూరల్ ఎంత్రప్రెన్యూర్ షిప్ ను ప్రోత్సహిస్తాం. పారిశ్రామికచ ఐటీ స్టార్టప్స్ కు ప్రయోజనం కలిగేలా చూస్తాం అనేది ఆనాటి మేనిఫెస్టో హామీల్లో ఒకటి. కేంద్రం తెచ్చిన కొత్త చట్టాల ప్రకారం వ్యవసాయ రంగానికి ప్రయివేటు పెట్టుబడులు, కొనుగోళ్ల ఊతం లభిస్తుంది. రైతులు ఎక్కడైనా అమ్ముకోవడానికి స్వేచ్ఛ ఇవ్వాలనే చిరకాల కోరిక కూడా నెరవేరుతుంది. కానీ కేజ్రీవాల్ మాత్రం తన ద్వంద్వ వైఖరిని, యూటర్న్ ప్రతిభను మరోసారి చాటుకున్నారు. రైతుల బాగు పడుతుంటే చూడలేని కుత్సిత మనస్తత్వం గల రాజకీయ నాయకుల జాబితాలో ఈయన కూడా చేరాడనే విమర్శలు వచ్చాయి. అయినా నాకేంటి అనుకుంటున్నాడేమో ఈ యూటర్న్ బాబా.