తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. ఈ నెల 30 న ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని ప్రారంభించనున్నారు.
చుట్టూ గ్రీనరీ, వాటర్ ఫౌంటేన్లు, చుట్టూ ఎత్తైన ప్రహారీ, హెలిపాడ్లు, విశాలమైన పార్కింగ్ ప్లేస్, ఉద్యోగులు, సందర్శకుల కోసం క్యాంటీన్, పోస్టాఫీస్, బ్యాంకు సౌకర్యాలు సహా అన్నింటినీ ఆధునిక హంగులతో తీర్చిదిద్దారు.
భవనం ఆరోఅంతస్తులో సీఎం, ఆయన సిబ్బంది ఉంటారు.ముఖ్మమంత్రి ఛాంబర్ కు అనుసంధానంగా పెద్ద మీటింగ్ హాలు ఉంది. అదే అంతస్తులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత సిబ్బంది ఛాంబర్లు ఉండనున్నాయి. మొదటి అంతస్తును సాధారణ పరిపాలన, ఆర్థికశాఖలకు కేటాయించారు. ఇక క్యాబినెట్ సమావేశాలు నిర్వహించడానికి వీలుగా విశాలమైన హాలు, ఒక బాంక్వెట్ హాలు, మరో పెద్ద ఆడిటోరియం, దేశవిదేశాల నుంచి ముఖ్య అతిథులు, ప్రతినిధులు వస్తే అక్కడే భేటీ అయ్యేలా ఏర్పాట్లు చేశారు. ప్రతీ అంతస్తులోనూ మంత్రుల చాంబర్లకు అనుసంధానంగా మీటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు.
ఇక విదేశీ, విశిష్ట అతిథుల కోసం… తూర్పు వైపు పోర్టికో పై భాగంలోని మధ్య గుమ్మటంలో హుస్సేన్ సాగర్ లేక్ వ్యూతో ఏర్పాటు చేసిన మీటింగ్ హాలు కొత్త సచివాలయంకు హైలైట్ కానుందని చెబుతున్నారు.
ఇక రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, జాతీయ పండుగల సందర్భంగా సచివాలయ సౌధం మొత్తాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించేలా శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యద్భుతమైన తెలంగాణ పరిపాలనా సౌధం 3 డీ యానిమేషన్ వీడియో ఆకట్టుకుంటోంది.