కెసిఆర్ విచిత్ర విన్యాసాలు
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు యూటర్న్ తీసుకోవడంలో రికార్డు సృష్టించారు. ఏక్ దం మూడు విషయాల్లో పీఛే ముడ్ అన్నారు. నియంత్రిత సాగుమీద కాడిపారేశారు. ఇక ఏ పంట పండించాలో రైతు ఇష్టం అన్నారు. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఉండవన్నారు. రైతులు దేశంలో ఎక్కడైనా పంట ఉత్పత్తులు అమ్ముకోవచ్చంటూ ప్రధానమంత్రి మోడీ మాటను రిపీట్ చేశారు. ఇక, కొత్త వ్యవసాయ చట్టాలను మొన్నటి వరకు తీవ్రంగా వ్యతిరేకించిన కట్వకుంట్ల వారు, వాటి ప్రకారం రైతులకు స్వేచ్ఛ లభించిందని చెప్పకనే చెప్పారు. మరి, కొత్త చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్ లో పాల్గొని టిఆర్ ఎస్ వాళ్లు గాయి గాయి చేసింది ఎందుకు? కెసిఆర్ సూచనతోనే ఆరోజు తెలంగాణలో ఏరోడ్డుమీదా ఎవరూ ప్రయాణించని పరిస్థితి ఎందుకు వచ్చింది? ముఖ్యమైన మంత్రి కెటిఆర్ పొద్దంతా పోలీస్ సాక్షిగా హైవేను బ్లాక్ చేసి ఎందుకు డ్రామా చేసినట్టు? ఈ ప్రశ్నలన్నింటికీ కెసిఆర్ జవాబు చెప్పారు.
తెలంగాణ ఎవరి జాగీరు కాదు. నియంత్రిత సాగు పేరుతో కెసిఆర్ రైతుల జీవితాలతో ఆటలు ఆడుకున్నారు. సన్న రకం వరినే పండించాలని ఒత్తిడి చేసి వాళ్ల ఉసురు పోసుకున్నారు. తీవ్రంగా నష్టపోయిన రైతుకు తగిన ధర ఇవ్వడానికి కల్వకుంట్ల సర్కార్ ముందుకు రాలేదు. రైతులు రోడ్డెక్కినా పట్టించుకోవడం లేదు. దుబ్బాక ఎన్నికలకు ముందు ఒకలా, తర్వాత మరోలా ప్రవర్తిస్తున్నారు. వరదలకు పంట నష్టం జరిగితే పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం మోడీ సర్కార్ తెచ్చిన ఫసల్ బీమాను తెలంగాణలో అమలు చేసి ఉంటే దాని ప్రకారం వరద బాధిత రైతులకు పరిహారం దక్కేది. అది కూడా దూరం చేసిన కెసిఆర్ కు రైతుల ఉసురు తగుగుతుందని ప్రతిపక్ష నేతలు తిట్టిపోస్తున్నారు. ఇప్పటికీ తెలంగాణలో దాదాపు 5 లక్షల మంది రైతులకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రకారం ఏడాదికి 6000 రూపాయలు రాకుండా కెసిఆర్ సర్కార్ అడ్డుకుంటోంది. ఎందుకు అని బిజెపి నేతలు ప్రశ్నిస్తున్నా సమాధానం లేదు.
పంట ఉత్పత్తులను రైతులు ఎక్కడైనా అమ్ముకోవడానికి మోడీ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కొత్త చట్టం తెచ్చింది. దాన్ని వ్యతిరేకిస్తూ మంత్రులు, ఇతర గులాబీ నేతలు ఒకరోజు రహదారులను దిగ్బంధించారు. దాని వల్ల ఆర్థిక వ్యవస్థకు వేల కోట్ల రూపాయల నష్టం వచ్చింది. దీన్ని కెసిఆర్ నుంచే వసూలు చేయాలనే వాదనలో పస ఉంది. కానీ అది జరుగుతుందా అనేది ప్రశ్న. మోడీ చట్టాలు కార్పొరేట్లకు కొమ్ముకాసేలా ఉన్నాయని కెసిఆర్ ఆన్నారు. తన ఫాంహౌస్ లో పండించినవి మాత్రం కార్పొరేట్లకు ఎందుకు అమ్ముకున్నారు అంటే జవాబు లేదు.
ధరణి పోర్టల్ పేరుతో కెసిఆర్ మరో విచిత్ర విన్యాసానికి తెరలేపారు. అదొక పనికిమాలిన పోర్టల్ అనే విమర్శలు వచ్చినా ముందుకు పోయారు. దీంతో రైతులకు ఇబ్బందులు తప్పలేదు. ఇక వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ మూడు నెలలు ఆగిపోయింది. దేశంలో, ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా ఇంతటి దారుణమైన నిర్ణయాన్ని తీసుకుని ఉండదు. ప్రజల సొమ్ముతో ఒక పాలరాతి భవనాన్ని కట్టించి, దానికి ప్రగతి భవన్ అనే పేరు పెడితే ఆఫీసు అయిపోదు. దేశంలో ఆరేండ్లుగా ఆఫీసుకు పోని ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్. అదే ఈ ప్రజల, రైతుల దౌర్భాగ్యం అన్న విపక్ష నేతల మాటలు ఇప్పుడు అందరినీ ఆలోచింప చేస్తున్నాయి.