తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో మీద కొత్తరకం చర్చ నడుస్తోంది. 10 సంవత్సరాలు పాటు ముఖ్యమంత్రిగా ఉండటంతో చాలామంది ఇప్పటికీ ఆ భావం నుంచి బయటకు రాలేకపోతున్నారు. కొన్ని కొన్ని సార్లు ఈ ఆలోచన కొంప ముంచుతోంది కూడా. తెలంగాణ ప్రభుత్వం లోని కొందరు ఉన్నతాధికారులు కూడా ఇప్పటికీ అదే భావనతో పనిచేస్తున్నారు.
విద్యా శాఖలోని కొందరు ఉన్నతాధికారులు చేసిన పని కోట్ల రూపాయలు నష్టానికి దారి తీసింది. వివరాలు చూస్తే… ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో బుధవారం పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు అధికారులు పాఠ్య పుస్తకాలు, వర్క్బుక్లు పంపిణీ చేశారు. అయితే, విద్యాశాఖ వీటిలో ముందుమాట మార్చకుండానే కొత్త బుక్స్ ముద్రించింది. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందిస్తున్నామన్న ఉత్సాహంతో గత బీఆఎస్ ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి పేర్లతో పాఠ్య పుస్తకాల్లో ముద్రించి పంపిణీ చేశారు.
కొత్తగా వచ్చిన పుస్తకాలు అన్నింటినీ వెరిఫికేషన్ చేయగా విద్యార్థులకు పంపిణీ చేసిన అన్ని తరగతుల తెలుగు పుస్తకాల్లోని ముందు మాట పేజీలో తప్పులు ఉండటంతో ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.. పాఠ్యపుస్తకాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, సంచాలకులు జగదీశ్వర్ పేర్లు ఉన్నాయి. దీంతో, అలర్ట్ అయిన విద్యాశాఖ విద్యార్థులకు పంపిణీ చేసిన పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.
మొత్తం మీద కొందరు అధికారులు చేసిన తప్పిదం తో కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అయ్యింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోతో కొత్త పుస్తకాలు అచ్చు వేయించి తిరిగి పంపిణీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.