జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ దిశగా వడివడిగా అడుగేస్తున్నారు. జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీ ద్వారా బీజేపీపై తన పోరాటాన్ని ఉధృతంచేయాలని నిర్ణయించారు. శుక్రవారం ప్రగతి భవన్లో సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో కొత్త పార్టీ పెట్టి జాతీయ స్థాయికి వెళ్లాలనే ఆలోచన ఉందని తెలిపారు. ఈ ప్రతిపాదనకు టీఆర్ఎస్ అగ్రనేతలందరూ ఆమోదం తెలిపినట్లు సమాచారం.
కేసీఆర్ కొత్త పార్టీకి ‘భారత్ రాష్ట్ర సమితి’ (BRS) లేదా నవ భారత్ పార్టీ (NBP) అని పేరు పెట్టనున్నట్లు సమాచారం. జూన్ 19లోపు టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశమవుతుందని.. అక్కడ కేసీఆర్ తన ప్రణాళికలను అధికారికంగా ప్రకటిస్తారని వర్గాలు తెలిపాయి. టీఆర్ఎస్ అధిష్టానం సాధారణంగా దసరా సందర్భంగా ఏదైనా కొత్త కార్యక్రమం లేదా ప్రాజెక్టులను ప్రారంభిస్తుంది.
ఇటీవల బెంగుళూరు పర్యటనకు వెళ్లిన సందర్భంగా కేసీఆర్ విలేకరులతో మాట్లాడుతూ త్వరలో ప్రజలు సంచలన వార్తను వింటారని అనడంతో టీఆర్ఎస్ ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తుందా లేదా కొత్త పేరుతో మరో పార్టీని ప్రకటిస్తారా అనే దానిపై స్పష్టత లేదు.
రాష్ట్రపతి ఎన్నిక కోసం టీఆర్ఎస్ వ్యూహాన్ని చక్కదిద్దేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి మంత్రులు, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు, సుమారు ఆరు గంటలపాటు ఈ సమావేశం నడిచింది. ఈ సమావేశంలో కేసీఆర్ దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండా ఆవశ్యకతపై చర్చను నడిపారు.