కెసిఆర్, ములాయం.. ఇద్దరూ ఇద్దరే
తెలంగాణ ముఖ్యమంత్రి సీట్లో కల్వకుంట్ల తారక రామారావు త్వరలోనే కూర్చోబోతున్నారనేది రాజకీయంగా తాజా బ్రేకింగ్ న్యూస్. టిఆర్ ఎస్ నాయకుల్లో దీనిపై జోరుగా చర్చ జరుగుతున్నది. మీడియాలో కూడా ఇదే చర్చనీయాంశం. ప్రజల్లోనూ చాలా మంది దీని గురించే చర్చించుకుంటున్నారు.
స్వతంత్ర భారత దేశంలో ప్రాంతీయ పార్టీ అంటే సామంత రాజ్యం లాంటిది. కుటుంబ ఆస్తి వంటిది. అలాంటి కుటుంబ పార్టీల్లో ఒకటి సమాజ్ వాదీ పార్టీ. మరొకటి తెలంగాణ రాష్ట్ర సమితి. ఈ రెండు పార్టీల వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్, కెసిఆర్ లకు చాలా పోలికలున్నాయి. ఒకవేళ కెటిఆర్ ను త్వరలోనే ముఖ్యమంత్రిని చేస్తే కెసిఆర్ కూడా ములాయం బాటలోనే నడిచినట్టు అవుతుంది.
ములాయం రాజకీయ గురువు రాంమనోహర్ లోహియా. కెసిఆర్ కు స్ఫూర్తి ఎన్టీ రామారావు. ములాయం జనతా పార్టీలో రాజకీయంగా పుట్టి పెరిగి ఆ తర్వాత సొంత పార్టీ పెట్టారు. కెసిఆర్ కొంత కాలం కాంగ్రెస్ లో ఉన్నా, ఎక్కువ కాలం టీడీపీలో కొనసాగారు. మంత్రి అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు జమానాలో మంత్రి పదవికి బదులు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన తర్వాత కెసిఆర్ బయటకు వచ్చారు. టిఆర్ ఎస్ పార్టీ పెట్టారు.
ములాయం, కెసిఆర్ ఇద్దరూ ఎం.ఎ. చదివారు. ములాయం రాజనీతి శాస్త్రంలో, కెసిఆర్ సాహిత్యంలో పీజీ పట్టా పుచ్చుకున్నారు. ఇద్దరూ కేంద్రంలో మంత్రులుగా పనిచేశారు. ములాయం ఎమర్జెన్సీ కాలంలో ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు. కెసిఆర్ తెలంగాణ సాధన కోసం తానే రెండో దశ ఉద్యమం మొదలుపెట్టారు. తాను సీఎం పదవిని అనుభవించింది చాలు అనుకుని 2012లో తన కొడుకు అఖిలేష్ యాదవ్ ను సీఎం నుచేశారు. ఆయన ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చెలాయించిన తర్వాత బిజెపి రూపంలో సమాజ్ వాదీ పార్టీకి గ్రహణం పట్టింది. 2017లో యూపీలో కమలం వికసించింది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మొదలైంది.
ఇప్పుడు కెసిఆర్ తాను తప్పుకొని కొడుకును ముఖ్యమంత్రిని చేస్తే అది ములాయం మార్గమే అని చెప్పవచ్చు. ప్రకాశ్ సింగ్ బాదల్, కరుణానిధి వంటి ప్రాంతీయ పార్టీల నేతలు వయోభారం ఇబ్బంది పెడుతున్నా తామే ముఖ్యమంత్రులుగా ఉన్నారు. కొడుకులను డిప్యుటీ సీఎంలుగా చేసి పాలన పగ్గాలు అప్పగించారు. ములాయం మాత్రం దీని భిన్నంగా, సుపుత్రుడికి తానే లైన్ క్లియర్ చేశారు. కెసిఆర్ కూడా అదే పని చేస్తారనే టాక్ నిజమవుతుందా లేదా అనేది వేచి చూడాలి.
మరో విషయంలో ములాయం, కెసిఆర్ లకు చాలా దగ్గరి పోలిక ఉంది. అదే, ముస్లింల బుజ్జగింపు రాజకీయం. నెహ్రూ హయాంలోనే కాంగ్రెస్ ఈ బుజ్జగింపు రాజకీయం మొదలుపెట్టింది. ములాయం మరో అడుగు కాదు, చాలా అడుగులు ముందుకు వేసి కాంగ్రెస్ కూడా ఊహించని విధంగా ముస్లింలను దువ్వారు. రకరకాల హామీలు, పథకాలతో మైనారిటీల ఓట్లను కొల్లగొట్టడానికి ప్రయత్నించారు. తెలంగాణలో కెసిఆర్ కూడా ముస్లింల బుజ్జగింపు రాజకీయాలు జోరుగా చేస్తున్నారు. ముస్లింలకు బిసి ప్రయోజనాలతో పాటు పూర్తి సబ్సిడీతో రుణాలు, హజ్ సబ్సిడీ, వగైరా తాయిలాలతో ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నారు. ములాయం పార్టీకి చెక్ పెట్టిన బిజెపినే ఇప్పుడు తెలంగాణలో కెసిఆర్ కు చెక్ పెట్టడానికి ఆవురావురు మంటోంది. కమలం దెబ్బకు ములాయం క్లీన్ బౌల్డ్ అయ్యారు. మరి ఈ విషయంలో కెసిఆర్ ఏం చేస్తారో. బిజెపి ధాటికి ఓడిపోతారో లేక గెలిచి తొడ గొడతారో చూడాలి. మరొక్క మాట, కమలనాథులు ములాయం ను ముల్లా సింగ్ యాదవ్ అంటారు. కెసిఆర్ ను నయా నిజాం అని ఆరోపిస్తున్నారు. ఈ విమర్శలోనూ ఇద్దరికీ పోలిక కనిపిస్తుంది.