తెలంగాణ సీఎం కేసీఆర్ ముంబైలో ఒకరోజంతా బీజీగా గడిపారు. థర్డ్ ఫ్రెంట్ అంటూ కొన్నిరోజులుగా హడావుడి చేస్తున్న ఆయన కలిసివచ్చే మిత్రులను వరుసగా కలుస్తున్నారు. బీజేపీ ముక్త భారత్ అంటూ నినాదం ఇచ్చిన ఆయన ఆదివారం ముంబై వెళ్లారు. అక్కడ అధికారంలో ఉన్న పార్టీలు ఎన్సీపీ, శివసేన చీఫ్ లు ఉద్ధవ్ తోనూ, శరద్ పవార్ తోనూ భేటీ అయ్యారు.
దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్చించామని ఉద్ధవ్, కేసీఆర్ ఉమ్మడి ప్రెస్మీట్లో తెలిపారు. దేశప్రయోజనాల కోసం టీఆర్ఎస్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ఉద్ధవ్ అన్నారు. దేశంలో విధాన పరమైన మార్పుల కోసం పోరాడుతామని…సోదరరాష్ట్రాలైన మహారాష్ట్ర, తెలంగాణలు దేశం కోసం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అన్నారు. అన్ని అంశాలపైనా ఏకాభిప్రాయానికి వచ్చామని భేటీ విజయవంతమైందని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. అంతకుముందు ఉద్ధవ్ నివాసంలో కేసీఆర్ బృందం విందుభోజనం చేశారు. కేసీఆర్ తో ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్ తో పాటు ప్రకాశ్ రాజ్ కూడా ఉద్ధవ్ ను కలిసినవారిలో ఉన్నారు.
ఉద్ధవ్ తో సమావేశం ముగించుకుని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటీ అయ్యారు తెలంగాణ సీఎం. ముంబైలోని పవార్ నివాసం సిల్వర్ ఓక్స్లో అడుగుపెట్టిన కేసీఆర్ బృందానికి పవార్ సహా,సుప్రియాసూలే సాదర స్వాగతం పలికారు. పవార్ ఆశీస్సులు తీసుకున్నానని… ఆయనతో భేటీ సందర్భంగా కీలక అంశాలపై చర్చించామని అన్నారు. దేశానికి సరికొత్త ఎజెండా, దార్శనికత అవసరమని అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మోదీపై కొంతకాలంగా నిప్పులు చెరుగుతున్నారు కేసీఆర్. బీజేపీని, మోదీని తరమికొట్టాలంటూ బీజేపీ ముక్త భారత్ అంటూ పిలుపునిచ్చారు. ఇప్పటికే కలిసివచ్చే పార్టీలు, నాయకులతో సంప్రదింపులు మొదలుపెట్టారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ఇప్పటికే ఇప్పటికే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్తోనూ విడివిడిగా సమావేశమై చర్చలు జరిపారు. రెండు రోజుల క్రితం మాజీ ప్రధాని జనతాదళ్ సెక్యులర్ నేత దేవెగౌడ సైతం కేసీఆర్ తో కలిసి నడిచేందుకు సిద్ధమని ప్రకటించారు. ఇక గతవారం కేసీఆర్ తో ఫోన్లో మాట్లాడిన ఉద్ధవ్ ఆయన్ని ముంబైకి ఆహ్వానించారు. త్వరలోనే బెంగళూరు వెళ్లి దేవెగౌడనూ కలిసే అవకాశం ఉంది.