కశ్మీర్లో ఉగ్రవాదుల వరుస హత్యలతో కేంద్రం అప్రమత్తమైంది. బుధవారం కుల్గాం జిల్లాలో బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ ను టెర్రరిస్టులు పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. రెండురోజుల క్రితమే రజనీబాలా అనే ఉపాధ్యాయురాలిని కాల్చి చంపారు ఇస్లామిక్ టెర్రరిస్టులు. గత రెండు నెలలుగా వరుస దాడులు జరుగుతున్నాయి. సామాన్యులు, పోలీసులు, వలసదారులు లక్ష్యంగా కాల్చి చంపుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా …జాతీయ భద్రతాసలహాదారు అజిత్ దోవల్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. లోయలో సామాన్య కశ్మీరీలు, వలసదారుల భద్రతల కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై చర్చించారు. పార్లమెంట్ నార్త్ బ్లాక్ లో జరిగిన ఈ సమావేశంలో హోంశాఖ ఉన్నతాధికారులూ పాల్గొన్నారు.