కశ్మీర్ ఫైల్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడుఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇఫీ జ్యూరీ హెడ్ నాదవ్ లాపిడ్. ఈ చిత్రాన్ని వల్గర్ ప్రాపగండాగా అభివర్ణించాడు. అయితే వాస్తవ గాథతో తెరకెక్కిన మూవీని అసభ్యమనడంపై పలువురు మండిపడుతున్నారు. అయితే నాదల్ లాపిడ్ వి వ్యక్తిగత వ్యాఖ్యలంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది జ్యూరీ బోర్డ్. అటు ఆయన మాటలు దుమారం రేపడంతో భారత్ లోని ఇజ్రాయెల్ రాయబారి ఖండించారు. కేంద్రప్రభుత్వానికి క్షమాపణలు తెలిపారు. అటు ఇజ్రాయెల్ కు చెందిన లాపిడ్ ఇలా వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు కశ్మీర్ పండిట్ కూడా అయిన నటుడు అనుపమ్ ఖేర్. ‘అబద్దం ఎంత ఎత్తులో ఉన్నా.. నిజంతో పోలిస్తే అది చిన్నదే..’ అని ఖేర్ గట్టిగా బదులిచ్చారు. అంతే కాదు. యూదుల మారణహోమం నిజమే అయితే.. కశ్మీరీ
పండిట్ల వలసలు కూడా నిజమేనన్నారు.
టూల్కిట్ గ్యాంగ్ మరోసారి యాక్టివ్ అయిందని ఆ పర్యవసానమే కశ్మీర్ ఫైల్స్ పై వ్యాఖ్యలనీ ఆయన అన్నారు. ఇదంతా పథకం ప్రకారం జరుగుతున్న కుట్రేనని స్పష్టంగా తెలుస్తోందన్నారు.
కశ్మీర్ ఫైల్స్ సినిమాపై లాపిడ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని బోర్డు తరఫున ప్రకటన ఇస్తూ జ్యూరీ సుదీప్తో సేన్ ట్వీట్ చేశారు. జ్యూరీ బోర్డు ఎప్పుడూ తన ఇష్టాలు, అయిష్టాల గురించి అధికారికంగా వెల్లడించదన్నారు.
ఇక లాపిడ్ ఈ ప్రకటన చేయడం ఆలస్యం బాలీవుడ్ నటి స్వరాభాస్కర్ స్పందించింది. ఆయన వ్యాఖ్యల్ని స్వాగతిస్తూ ట్వీట్ చేసింది. మరోసారి ప్రపంచానికి ఇది స్పష్టమైందని కామెంట్ చేసింది.
నాదవ్ లాపిడ్ ప్రకటనపై ఇజ్రాయెల్ కౌన్సిల్ జనరల్ కోబ్బి శోషని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన స్టేట్మెంట్ పూర్తిగా తప్పని..తాను సినిమా చూస్తూ కన్నీటిపర్యంతం అయ్యాననీ అన్నారు. ఆ సినిమాను ఇజ్రాయెల్ లో కూడా ప్రదర్శించారని చెబుతూ… భయంకరమైన విషయాలను అనుభవించిన యూదులు, ఇతరుల బాధలను అర్థం చేసుకుంటారని, అర్థంచేసుకోవాలనీ అన్నారాయన.