అమర్నాథ్ యాత్రలో చనిపోయిన భక్తుల సంఖ్య 16 చేరింది. గల్లంతైన 40 మంది కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. వరద తీవ్రత ఆగిపోయినా నిన్నటి ఘటనా ప్రాంతంలో వర్షం మాత్రం ఏకధాటిగా కురుస్తోంది. భారత ఆర్మీతో పాటు ఎన్డీఆర్, ఎస్డీఆర్, సీఆర్పీఎఫ్, ఇతర భద్రతా సిబ్బంది సహాయకచర్యల్లో ఉన్నాయి. శుక్రవారం ఆకస్మికంగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో పలువురు మృతిచెందగా వేలాదిమంది చిక్కుకుపోయారు. ఇప్పటికే 15వేలమంది భక్తులను అక్కడినుంచి సహాయక బృందాలు సురక్షితప్రాంతాలకు తరలించారు. గాయపడిన దాదాపు 70మందిని వాయుసేన ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
అమర్నాథ్ యాత్ర జూన్ 30నుంచి ప్రారంభమైంది.వేలాదిగా భక్తులు మంచులింగ దర్శనం కోసం వెళ్లారు.అయితే మంచులింగం సమీపంలోనే ఒక్కసారిగా కుండపోత వర్షం పడడంతో వరద పోటెత్తింది. నీటితోపాటు బురద, రాళ్లు కొండలపైనుంచి వానలా పడ్డాయి. దీంతో అక్కడున్న భక్తులు భయంతో పరుగులుతీశారు. తొక్కిసలాటలో కొందరు చనిపోగా మరికొందరు గల్లంతయ్యారు.వరదబీభత్సం నేపథ్యంలో అమర్నాథ యాత్రను నిలిపేశారు.