దేశ విభజన సమయంలో జరిగిన మరో పొరపాటు కర్తార్ పూర్ గురుద్వారా పాకిస్తాన్ వైపుకు వెళ్లడం అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సరిహద్దుకు కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో గురుద్వారా ఉందని గుర్తు చేశారు. ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎల్పీఏఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. సిక్కుల పవిత్ర స్థలం కర్తార్ పూర్ పాకిస్తాన్ కు దక్కడం పెద్ద పొరపాటనీ ఆయన అన్నారు. గురునానక్ జయంతి సందర్భంలో ఈ విషయం గుర్తొస్తే మనస్సు కలుక్కుమంటుందనీ కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యానించారు.
సిఖ్ లకు ఎంతో పవిత్రమైన గురుద్వారా దర్బార్ సాహిబ్ పాక్లోని కర్తార్పూర్లో ఉండగా, గురుద్వారా డేరా బాబా నానక్ భారత్లో ఉంది. అయితే, రెండు ప్రదేశాలను దర్శించుకోవాలనుకునే సిక్కులకు దేశాల మధ్య ఉన్న విబేధాలు సమస్యగా మారాయి. దీంతో ఇరు దేశాల్లోని గురుద్వారాలను కలుపుతూ కర్తార్పూర్ కారిడార్ తీసుకురావాలని రెండు దశాబ్దాల క్రితమే కేంద్రం ప్రతిపాదించింది. అయితే 2019లో ఎట్టకేలకు దీన్ని ప్రారంభించారు. కర్తార్పూర్ కారిడార్ ప్రకారం భారత దేశానికి చెందిన సిక్కులు, హిందువులు పాక్లోని గురుద్వారాను వీసా లేకుండానే దర్శించుకోవచ్చు. అయితే, పాక్ సిక్కులు మాత్రం భారత్ లోని గురుద్వారాను దర్శించుకోవాలంటే వీసా తీసుకోవాలి.
ఈ కారిడార్ను నిర్వహిస్తోంది ఎల్పీఏఐ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు, సిక్కుల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడంలో ఎల్పీఏఐ కీలకపాత్ర పోషిస్తోంది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)