కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో కుంపటి రాజు కొంటోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది .ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రెండు గ్రూపులుగా చీలిపోయి రాజకీయం నడుపుతున్నారు. సిద్ధరామయ్యను దించేసి సీఎం సీటు దక్కించుకోవాలని డీకే గ్రూప్ ప్లాన్ చేస్తోంది. అసలు డీకే నుంచి పీసీసీ అధ్యక్షుడు పదవి తీసేయాలని సీఎం గ్రూపు పావులు కదుపుతోంది. ఇందుకు అనుగుణంగా రెండు వర్గాల నుంచి నాయకులు ఢిల్లీ వెళ్లి లాబీయింగ్ చేస్తున్నారు.
కర్ణాటక కాంగ్రెస్ లో టాప్ నుంచి కిందిస్థాయి దాకా శ్రేణులు రెండుగా చీలిపోయి కనిపిస్తున్నారు. రాజకీయాలు తీవ్రమవుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు చెక్ పెట్టేందుకు సిద్ధరామయ్య వర్గం మరో ముగ్గురిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించాలనే డిమాండ్ను తెరపైకి తెచ్చింది. మరోవైపు సిద్ధరామయ్య ఇక ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దిగిపోయి శివకుమార్కు అప్పగించాలని ఆయన వర్గం కొత్త రాగం అందుకున్నది. దీంతో కర్ణాటక కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. డీకేను నిలవరించేందుకు సిద్ధరామయ్య, సిద్ధరామయ్యకు ఎసరు పెట్టేందుకు డీకే తెరవెనుక ఉండి తమ వర్గీయులతో బాహాటంగా ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు.
తాజాగా, డీకే శివకుమార్ను సీఎం చేయాలని, ఆ పదవిలో ఉన్న సిద్దరామయ్య తప్పుకోవాలని వక్కలింగ వర్గానికి చెందిన ప్రముఖ మఠాధిపతి కుమార చంద్రశేఖరనాథ స్వామి ముఖ్యమంత్రి సమక్షంలోనే చెప్పడం రాజకీయ దుమారం రేపుతోంది. బెంగుళూరు వ్యవస్తాపకుడు కెంపెగౌడ 515వ జయంతి ఉత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. డిప్యూటీ సీఎం శివకుమార్ కూడా వక్కలింగ కులానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం.
ప్రస్తుతం కర్ణాటకలో డీకే శివకుమార్ మాత్రమే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఆయనతో పాటు లింగాయత్, ఎస్సీ/ఎస్టీ, మైనారిటీ వర్గాల నుంచి ఒక్కొక్కరి చొప్పున మరో ముగ్గురిని డిప్యూటీ సీఎంలుగా నియమించాలని మంత్రి కేఎన్ రాజన్న డిమాండ్ చేశారు. కాంగ్రెస్లో ఒక్కరికి ఒకే పోస్టు ఇవ్వాలనే పద్ధతి ఉందని, ఈ పద్ధతిని పాటించి డీకే శివకుమార్ తన పీసీసీ అధ్యక్ష పదవిని వదులుకోవాలని సైతం రాజన్న పేర్కొన్నారు. డీకే శివకుమార్కు చెక్ పెట్టేందుకు సీఎం సిద్ధరామయ్య వర్గం ఈ రెండు వాదనలను తెరపైకి తెచ్చినట్టు సమాచారం.
లోక్సభ ఎన్నికలకు ముందే మరిన్ని సామాజిక వర్గాలకు ఉపముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చినా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హెచ్చరికతో ఎన్నికల దాకా మౌనం పాటించారు. డీకే శివకుమార్కు వ్యతిరేకంగా సిద్ధరామయ్య వర్గం పావులు కదుపుతుండటంతో డీకే వర్గం కూడా అప్రమత్తమైంది. సిద్ధరామయ్య సీఎం పదవిని వదిలి శివకుమార్కు అప్పగించాలని చెన్నగిరి ఎమ్మెల్యే బసవరాజు శివగంగ బుధవారం డిమాండ్ చేశారు. సిద్ధరామయ్య గతంలో ఐదేండ్లు, ఇప్పుడు ఏడాదిన్నర సీఎంగా ఉన్నారని, ఇక దిగిపోవాలని స్పష్టం చేశారు. మరో ముగ్గురు డిప్యూటీ సీఎంలను నియమించాలనే వాదనను కూడా డీకే వర్గం తప్పుపడుతున్నది. డిప్యూటీ సీఎం పదవి ఖాళీ లేదని మంత్రి చెలువరాయస్వామి.. సిద్ధరామయ్య వర్గానికి కౌంటర్ ఇచ్చారు.
మరో సీనియర్ మంత్రి ప్రియాంక ఖర్గే స్పందిస్తూ మంత్రులందరినీ డీసీఎంలు చేస్తే సరిపోతుందని అంటూ ఎద్దేవా చేశారు. వివిధ సామాజిక వర్గాలకు ఉపముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టాలనే ప్రతిపాదన చేస్తూ తనను కట్టడి చేయాలని చూస్తున్న వారిపై పిసిసి అధ్యక్షుడిగా కూడా ఉన్న డీకే శివకుమార్ ఎదురు దాడికి సిద్దమవుతున్నట్లు తెలుస్తున్నది.
లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ … ఓటమిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని, ఎవరు పనిచేయలేదో సంబంధిత ఇన్చార్జ్లపై చర్యలు తీసుకోవాలని సూచించారు. రాహుల్గాంధీ సూచనలను ఆసరాగా తీసుకొని బెంగళూరుతోపాటు మైసూరు, దక్షిణకన్నడ, మండ్య, ఉత్తరకర్ణాటక ప్రాంతాల్లో ఇన్చార్జిలుగా వ్యవహరించినవారు సిద్దరామయ్యకు ఆప్తులు కావడంతో వీరిపై వ్యతిరేకంగా నివేదిక రూపొందించడం ద్వారా కట్టడి చేయాలని డీకే శివకుమార్ భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
కాంగ్రెస్ పార్టీలో తుది నిర్ణయం ఢిల్లీలో జరుగుతుంది అన్న విషయం తెలిసిందే . అందుచేత అక్కడ నిరూపించుకోవాలని రెండు గ్రూపులు ప్రయత్నాలు చేస్తున్నాయి. త్వరలోనే కర్ణాటక కాంగ్రెస్ లో బాంబులాంటి వార్త బయటపడే అవకాశం ఉంది.