కర్ణాటకలో బెంగళూరు పోలీసులు సుమారు 310 కు పైగా సంస్థలకు నోటీసులు జారీ చేశారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య నిషేధిత సమయాల్లో కోర్టు ఆదేశాలను ధిక్కరించి.. లౌడ్స్పీకర్లను ఉపయోగించినందుకు మసీదులు, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు సహా కనీసం 310 సంస్థలకు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నివేదికల ప్రకారం, నిషేధిత సమయాల్లో లౌడ్ స్పీకర్లను ఉపయోగించినందుకు.. శబ్దం 60 డెసిబుల్స్ పరిమితిని దాటినందుకు.. బెంగళూరు పోలీసులు 125 మసీదులు, 83 దేవాలయాలు, 22 చర్చిలు, పబ్లు, బార్లతో సహా 59 వాణిజ్య సంస్థలకు నోటీసులు జారీ చేశారు.
ఏప్రిల్, 2021 లో ప్రార్థనా స్థలాల వద్ద లౌడ్ స్పీకర్ల అక్రమ వినియోగాన్ని నియంత్రించడంలో విఫలమైనందుకు కర్ణాటక హైకోర్టు సంబంధిత అధికారులను నిలదీసిన విషయం తెలిసిందే. నిర్ణీత సమయాల్లో లౌడ్స్పీకర్ల వినియోగంపై నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు 40కి పైగా కేసులు నమోదు చేసినట్లుగా బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ కమల్ పంత్ తెలిపారు.
“మేము సుప్రీం కోర్టు ఆర్డర్ను ఖచ్చితంగా అమలు చేస్తాం. అలాగే ప్రార్థనా స్థలాలు, కర్మాగారాలు, పరిశ్రమలు, పబ్బులు, బార్లు సహా వాణిజ్య సంస్థలను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తాం. ప్రతి ఒక్కరూ కోర్టు ఆదేశాలను పాటించాలి” అని పంత్ అన్నారు. లౌడ్ స్పీకర్ల అక్రమ వినియోగాన్ని పోలీసు పెట్రోలింగ్ తనిఖీ చేస్తుందని మరో సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
నాయిస్ పొల్యూషన్( రెగ్యులేషన్ అండ్ కంట్రోల్) రూల్స్, 2000 ప్రకారం, అధికార యంత్రాంగం నుంచి వ్రాతపూర్వక అనుమతి పొందిన తర్వాతే లౌడ్ స్పీకర్లను, సౌండ్ సిస్టమ్లను ఉపయోగించాలనే పరిమితులు ఉన్నాయి. ఆడిటోరియం, కాన్ఫరెన్స్ రూమ్లు, కమ్యూనిటీ హాల్స్ సహా బాంకెట్ హాల్స్లో కమ్యూనికేషన్ కోసం మూసి ఉన్న ప్రాంగణాల్లో తప్ప రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల మధ్య లౌడ్ స్పీకర్, సౌండ్ సిస్టమ్లపై నిషేధం ఉంది.
మసీదులలో లౌడ్ స్పీకర్ల వాడకంపై నిషేధాన్ని అమలు చేయాలని హిందూ కార్యకర్తలు, సంస్థల పిలుపుల మధ్య లౌడ్ స్పీకర్ల అక్రమ వినియోగానికి వ్యతిరేకంగా ఈ డ్రైవ్ ఊపందుకుంది. ఇస్లామిక్ ప్రార్థనా స్థలాలలో లౌడ్స్పీకర్లు విపరీతంగా పెరిగిపోయాయి. వాటిని రోజుకు ఐదుసార్లు ప్రార్థనకు పిలుపునిచ్చే అజాన్ను మోగించడానికి ఉపయోగిస్తారు.
అజాన్ను ప్రసారం చేయడానికి లౌడ్స్పీకర్ల అనుచిత వినియోగం దేశవ్యాప్తంగా అనేక మంది ప్రజలు తీవ్రమైన శబ్ద కాలుష్యానికి గురవుతున్నారు. గత కొన్నేళ్లుగా మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను నిషేధించాలనే డిమాండ్ పెరుగుతోంది.
ఇటీవల కొన్ని హిందూ సంఘాలు లౌడ్ స్పీకర్ల ద్వారా మోగించే అజాన్కు వ్యతిరేకంగా ఉదయం హనుమాన్ చాలీసాను లౌడ్ స్పీకర్ల ద్వారా ప్లే చేయడం ప్రారంభించాయి. మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తొలగించడంలో ప్రభుత్వం విఫలమైతే.. దేవాలయాల్లో లౌడ్ స్పీకర్లను ఉపయోగించి భజనలు పాడి తమ నిరసనలను ఉధృతం చేస్తామని హిందూ కార్యకర్త, శ్రీరామ సేన అధినేత ప్రమోద్ ముతాలిక్ హెచ్చరించారు.