ఏప్రిల్ నెల ప్రారంభంలో రాజస్థాన్లోని కరౌలీలో జరిగిన మతపరమైన హింసలో ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) ప్రమేయం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నూతన సంవత్సర వేడుకల ర్యాలీ సందర్భంగా ఇస్లామిస్టుల గుంపు హిందువుల ఊరేగింపుపై దాడి చేయడంతో పెద్దఎత్తున హింస చెలరేగింది. అసలైతే ముస్లింఅధికంగా ఉన్న ప్రాంతంనుంచి హిందూ ఉరేగింపునకు అనుమతిస్తే హింస జరగొచ్చని పీఎఫ్ఐ ముఖ్యమంత్రి గెహ్లాట్ కు ముందుగానే లేఖ రాసింది. ఆ తరువాత సంస్థ రాజస్థాన్ ప్రెసిడెంట్ మహ్మద్ ఆసిఫ్ పోలీసు రక్షణ కోరుతూ సీఎంకు విన్నవించారు. ఈ లేఖ ద్వారా కేరళకే పరమితం అయిందనుకున్న సంస్థ రాజస్థాన్ లోనూ ఉనికిని బహిరంగంగా ప్రకటించినట్టైంది.
మహ్మద్ ఆసిఫ్ ముఖ్యమంత్రికి, రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ అధికారులకు లేఖ రాసిన తర్వాత, అదే సమాచారాన్ని తెలియజేస్తూ PFI ఏప్రిల్ 1న ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. “ఏప్రిల్ 2 నుంచి 4 వరకు హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, పట్టణాలలో RSS, దాని అనుబంధ సంస్థలు ర్యాలీ నిర్వహించనున్నాయని అయితే మతపరమైన హింసను ప్రేరేపించే నినాదాలను నిషేధించాలని, శాంతిభద్రతలను కాపాడేందుకు చర్య తీసుకోవాలని లేఖలో ప్రస్తావించింది. సీఎంతో పాటు డీజీపీకీ లేఖ పంపారు. తరుచుగా ఇలా ర్యాలీలు తీస్తున్న వాళ్లంతా మతసామరస్యానికి భంగం కలిస్తున్నారని… మైనారిటీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి ర్యాలీలకు అనుమతించకూడదనీ అందులో పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థల కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అని పీఎఫ్ఐ రాజస్తాన్ చీఫ్ పేరులో ఆ లేఖ రాశారు.
అంటే ప్రమాదం జరిగితే దాని బాధ్యత అవతలివాళ్లదేననే ప్రచారం ముందుగానే మొదలుపెట్టింది పీఎఫ్ఐ. ఆరోజు ఊరేగింపు కరౌలీలో ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతం గుండా వెళుతున్నప్పుడు, ఊరేగింపుపై ఇస్లామిక్ గుంపు రాళ్ల దాడి చేసింది. అనేక వాహనాలు, దుకాణాలు ధ్వంసం అయ్యాయి. అల్లర్ల తరువాత పీఎఫ్ఐ పత్రికా ప్రకటనపై పలువురికి సందేహాలు వచ్చాయి. ఆయా ప్రాంతాలలో మతపరమైన ఉద్రిక్తతల గురించి PFI కి ఎలా తెలుసు అనే ప్రశ్నలు వెల్లువెత్తాయి.
అనేక సంవత్సరాలుగా PFIని ట్రాక్ చేస్తున్న కేరళలోని ఇంటెలిజెన్స్ అధికారులు ఈ సంస్థ విస్తరణ వేగంగా జరుగుతోందంటూ ఆశ్చర్యపోతున్నారు. సేవియర్స్ మి అనే ట్యాగ్ లైన్ దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ముస్లింయువకులను ఆకర్షిస్తోందిట. అటు ఇంకా పలు ఉగ్ర కార్యకలాపాలతో సంబంధాలున్నట్టు ఆధారాలు సైతం ఉండడంతో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను కేంద్రం త్వరలోనే నిషేధించనుందనే వార్తలు వస్తున్నాయి.