కమల దళం దక్షిణ భారతంలోని మరో రాష్ట్రంలో పాగా వేయాలని పక్కా స్పెచ్ వేస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో అధికారంలో ఉన్న పార్టీ.. తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి అధికారం చేపట్టేందుకు ఉవ్విళ్లూరుతోంది. అయితే ఇప్పటి వరకు తమిళనాడులో పెద్దగా ప్రభావం చూపని ఆ పార్టీ.. ఈ సారి 20 స్థానాల్లో పోటీకి నిలబడుతోంది. పోటీ చేసే అన్ని స్థానాల్లో కచ్చితంగా గెలవాలని కృతనిశ్చయంతో ఉంది. సోమవారం నాడు 17 మంది అభ్యర్ధుల జాబితా విడుదల చేశారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.మురగన్. అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేసే 20 స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మొత్తం 20 స్థానాల్లో బరిలోకి దిగుతున్నామని.. 17 మంది జాబితాను అధిష్టానం విడుదల చేసిందని.. మరో ముగ్గురిని కూడా త్వరలోనే ప్రకటిస్తుందన్నారు. పార్టీశ్రేణులంతా అన్ని నియోజకవర్గాల్లో ఉత్సాహంతో ప్రచారం చేస్తున్నారని మురగన్ అన్నారు.