సమాజ సేవ, NGO లు గతంలోనూ ఇప్పుడూ కూడా ఇది అతి సులువుగా డబ్బులు, పేరు సంపాదించే మార్గంగా చాలా మంది తెలివైన వారు ఎంచుకుంటున్నారు.
దీనిలో పెట్టుబడి తక్కువ. వ్యాపార రిస్క్ తక్కువ. గతంలో ఒక లక్ష రూపాయిలు విరాళం సేకరిస్తే దానిలో ఒక 50 వేల రూపాయల వరకు నిర్వహణ ఖర్చులు క్రింద వాడేసుకోవచ్చు. అంటే వచ్చిన డొనేషన్స్ లో సగం డబ్బు మనకు, అంటే మనకు వేతనం లేదా హానరోరియం, మనకు కావలసిన వాళ్లకు జీతాలు, అద్దెలు,ఖర్చులు రూపంలో చెల్లించవచ్చు. అలాగే మిగతా 50 శాతం డబ్బులు కూడా సమాజ సేవకు ఉపయోగించినట్లు కొన్ని ఫోటోలు, కొన్ని వీడియోలు పెట్టీ కొన్ని బిల్లులు పెట్టీ మిగతా సగం డబ్బులు కూడా ఖర్చు పెట్టయ్యవచ్చు.. అభాగ్యులు పడుతున్న కష్టాలు, వీళ్ళు చేస్తున్న సాయం రంగు రంగుల ఫోటోలు, వీడియోలు ద్వారా విదేశాలకు పంపి లక్షల్లో, కోట్లలో డొనేషన్స్ కూడా సేకరించుకోవచ్చు.
దేశంలో ఈ NGO వ్యాపారం 2014 వరకు నిరాటంకంగా సాగింది. కారణం చట్టాలు కఠినంగా లేకపోవడం, వీటి మీద ఏమైనా చర్యలు తీసుకుంటే మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక వార్తలు వస్తాయి అనే అనుమానాలతోనో లేక ప్రభుత్వ పెద్దలకు కూడా రాజకీయాల/ఎన్నికల సమయంలో ఈ NGO ల సహాయ సహకారాలు ఉపయోగపడతాయని బహుశా గత ప్రభుత్వాలు చూసి చూడనట్లు వ్యవహరించడంతో వీటికి హద్దు ఆపూ లేకుండా దేశంలో ఇవి విచ్చలవిడిగా పెరిగిపోయాయి. ఆఖరుకు వీటికి ముక్కుతాడు వెయ్యడానికి సుప్రీం కోర్టు కలుగచేసుకోవాల్సి వచ్చింది
2014 మోడీ ప్రభుత్వం వచ్చాక సుప్రీం ఆదేశాల అనుసారం నిబంధనలు కఠినతరం చేయడంతో ముఖ్యంగా నిర్వహణ ఖర్చులు పరిమితిని 50%నుండి 20%కు మాత్రమే పరిమితి చెయ్యడం, జమ ఖర్చుల నివేదికలు సంబంధిత ప్రభుత్వ శాఖలకు ప్రతీ సం. సమర్పించడం తప్పని సరి కావడంతో ఈ NGO ల నిర్వాహకులకు గొంతులో వెలక్కాయ అడ్డం పడినట్లు అయింది.
గత 7 సం.లలో ఇలా నిబంధనలు పాటించని వేల కొద్ది NGO ల లైసెన్సులు రద్దు చేశారు. అందుకే గతం లో లాగా ఇప్పుడు కొత్త NGO లు తెరవడానికి వెనుకంజ వేస్తున్నారు.
ఇప్పుడు మరో లేటెస్ట్ ట్రెండ్ మొదలయ్యింది….
దీనికి మాత్రం కాస్త ముందస్తు పెట్టుబడి ఎక్కువ పెట్టాలి. మీడియాను, సోషల్ మీడియాను ఎంత బాగా ఉపయోగించుకోవడం తెలిస్తే మన పెట్టుబడి మీద అంత లాభాలు వస్తాయి. అంతే కాదు సంఘంలో పేరు ప్రతిష్టలు, పలుకుబడి వచ్చి రాజకీయాలలోకి ప్రవేశించడానికి ఆహ్వానాలు కూడా అందుతాయి.
దీని కోసం మనం ఏం చేయాలి అంటే మనం చేయబోయే సేవ కార్యక్రమాలకు మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ విపరీతంగా పబ్లిసిటీ ఇచ్చే విధంగా ముందుగా అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ తో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవాలి. అలాగే పెద్ద పెద్ద నగరాల్లో ఉండే జర్నలిస్టులకు, యాంకర్లకు మంచి ఫైవ్ స్టార్ హోటల్స్ లో మందు, ముక్క, గానా బజానా పార్టీలు పెట్టీ ఖరీదైన గిఫ్టులు ఇచ్చి మనకు మీడియాలో, సోషల్ మీడియాలో బాగా గుర్తింపు వచ్చేటట్లు వీరి ద్వారా ప్రయత్నించాలి.
ఇక మనకున్న ఆర్థిక స్తోమత బట్టి ఒక కోటి లేదా 10 కోట్ల రూపాయలు బీద వారిని, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటున్నట్లు సమాజ సేవ కోసం ఖర్చు చేస్తూ ఉండాలి. ఆ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు మనం నియమించుకున్న అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు ద్వారా మరియు మనం మేపిన మన మీడియా విశ్వాస జనాలు ద్వారా 24/7 మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ వార్తలు వచ్చేటట్లు చూసుకోవాలి. ఇలా ఒక 6 నెలలు 7 నెలలు లేదా సం. గడిచే సరికి సంఘంలో మనకి బాగా గుర్తింపు వచ్చి అవార్డులు మొదలగునవి వచ్చి పెద్ద సెలబ్రిటీ స్థాయికి ఎదిగిపోతాం.
ఎప్పుడు అయితే మనకి సెలబ్రిటీ స్థాయి వచ్చి కోట్లలో అభిమానులు తయారు అవుతారో మనం అడ్వర్టైజ్మెంట్ కంపెనీల కళ్ళల్లో పడతాం, మనతో వాణిజ్య ప్రకటనలు షూట్ చెయ్యడానికి ఆ కంపెనీలు మన వెంటపడతాయి. అంతే ! ఇంక వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం వుండదు. మనకి ప్రకటనల ద్వారా మరియు మనం స్థాపించిన ఛారిటీ సంస్థకు విరాళాలు ద్వారా కోట్లలో డబ్బులు రావడం మొదలవుతుంది.
ఇక మన సొంత సొమ్ము దానాలకు ఉపయోగించనవసరం లేదు. మన ఛారిటీ సంస్థకు కోట్లలో వచ్చే విరాళాలతో మనం చేతిలో పైసా ఖర్చు పెట్టే అవసరం లేకుండా ఇంకా పేరు సంపాదించవచ్చు. ఈ ఛారిటీ సంస్థ కార్యక్రమాల విషయం మాత్రం మీడియాలో ప్రముఖంగా వచ్చేటట్లు చూసుకుంటూ మన సమాజ సేవ వ్యాపారాన్ని మూడు దానాలు ఆరు ప్రకటనలు లాగా నిరంతరాయంగా కొనసాగించవచ్చు.
అదే సమయంలో మనం నేరుగా కానీ మన కుటుంబ సభ్యులను కానీ ఏదో పెద్ద రాజకీయ పార్టీలో జాయిన్ చేసి ఆ పార్టీ అభిమానుల మద్దతు కూడా పొందవచ్చును.
ఇంకేం మీరూ ప్రయత్నించండి…
Courtesy :- Chada Shastry