ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గురువారం రాత్రి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. తెలుగు రాష్ట్రాల గురించి కీలక విషయాలను ఆయనకు వివరించారు. తెలంగాణ డీజీపీని కలిసేందుకు టైం అడిగితే ఇవ్వలేదని.. కానీ హోం మంత్రి మాత్రం అడగ్గానే సమయం ఇచ్చారని పాల్ తెలిపారు. ప్రధాని మోదీని కలవాలని అమిత్ షా సూచించారని పాల్ చెప్పారు. తెలంగాణలో అవినీతి పెరిగిపోయిందని హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసిన విషయాన్ని తెలిపారు. ఇటీవల తెలంగాణలో తనపై జరిగిన దాడి గురించి హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. తన ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర మంత్రి.. మరో రెండు రోజుల్లో తాను హైదరాబాద్ వస్తున్నానని, అప్పుడు చర్యలు తీసుకునేలా చూసుకుంటానని హామీ ఇచ్చారన్నారు. కేవలం దాడి గురించి మాట్లాడటానికే ఇక్కడికి రాలేదని.. ఇంకా మరెన్నో అంశాలను చర్చించడానికి వచ్చానని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు తాను ఇదివరకెన్నడూ చూడలేదని..కేసీఆర్, కేటీఆర్ పాలనలో తెలంగాణలో రూ.లక్షల కోట్లు అవినీతి జరిగిందని కేఏ పాల్ ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలు అప్పులు చేస్తున్న తీరుపై పాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ అప్పులు రూ.8 లక్షల కోట్లు ఉంటే.. తెలంగాణ రుణాలు రూ.4.5 లక్షల కోట్లు ఉన్నాయి. ఇలా అప్పులు చేసుకుంటూ వెళ్తే.. మరో శ్రీలంక అవుతుందని.. ఈ విషయాన్ని హోం మంత్రికి చెప్పానన్నారు పాల్. అమిత్ షాతో చాలా విషయాలు చర్చించానన్నారు. ప్రజాశాంతి పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని ఆయన తెలిపారు.