ఆయన సాక్షాత్తూ ఓ న్యాయమూర్తి. కానీ కనీస విచక్షణ మరిచారు. ఓ కళాకారిణిని అవమానించి వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయనే కేరళకు చెందిన న్యాయమూర్తి కలాం పాషా. పాలక్కాడ్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానిక ప్రభుత్వ మోయన్ ఎల్పీ స్కూల్లో ప్రముఖ మోహినీఅట్టం నర్తకి డాక్టర్ నీనా ప్రసాద్ ప్రదర్శన జరుగుతుండగా..అది తనకు నచ్చలేదంటూ నిలిపేయించారా జడ్జి. శనివారం రాత్రి ఎనిమిదిన్నరకు ఈ ఘటన జరిగింది. నగర ప్రముఖులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆమె నాట్య ప్రదర్శనను ఆసక్తిగా చూస్తుండగానే ఇది జరిగింది.
న్యాయమూర్తి ఆదేశంతో అక్కడే ఉన్న పోలీసులు వేదికపైకి వెళ్లి ఆమె షోను అడ్డుకున్నారు. ఆ సమయంలో కృష్ణుడు, అర్జునుడి మధ్య సంబంధాలలోని వైరుధ్యాలను తెలిపే ‘సఖ్యం’ పేరుతో ఆమె ప్రదర్శన ఇస్తున్నారు. అంతమందిలో వేదికపైనే తనను అవమానించడంపై నీనా సహా ఆమె బృందం కన్నీరుమున్నీరైంది. తన ప్రొఫెషనల్ లైఫ్ లోనే ఇది చేదుఅనుభవమని ఆమె వాపోయారు.
ఆ ప్రదర్శన కోసం ఆమె చాలా సాధన చేశారు. ఆమెకు జరిగిన అవమానంపై ఇతర కళాకారులూ ఆవేదన చెందారు. ప్రదర్శన నచ్చలేదని అడ్డుకోవడం ద్వారా సదరు న్యాయమూర్తి సాంస్కృతిక అసహనాన్ని ప్రదర్శించారని ప్రముఖ కళాకారుడు డాక్టర్ ప్రసాద్ అన్నారు. ఇతర కళాకారులు, కళా సంస్థలు ఆమెకు మద్దతుగా గళమెత్తారు. కళాకారులు, సాహితీవేత్తల గొంతు నొక్కుతున్నారని.. రాష్ట్ర కళలు, సంస్కృతిని అణచివేసే కుట్రలు జరుగుతున్నాయని కళా సాహిత్య సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. మలయాళీలు ఎప్పుడూ బ్యూరోక్రాట్లు, న్యాయమూర్తుల కంటే కళాకారులకే ఎక్కువ గౌరవం, ప్రాధాన్యత ఇస్తారని వారు గుర్తు చేశారు. ఎంఎస్ సుబ్బులక్ష్మి వంటి వారికి దేశం, ప్రధానులు, రాష్ట్రపతులు ఎంతటి స్థానం, గౌరవం ఇచ్చారో తెలుసుకోవాలని అన్నారు.
అయితే న్యాయమూర్తి ఆదేశాలను పాటించడం తప్ప తమకు మరో మార్గం లేకపోయిందన ప్రదర్శనను ఆపిన పోలీసులంటున్నారు.
న్యాయమూర్తి పాషాకు వివాదాలు కొత్తేం కాదు. ఆయనపై త్రిపుల్ తలాక్ ఆరోపణలు చేస్తూ…న్యాయం చేయాలంటూ కేరళ హైకోర్టును ఆశ్రయించారు ఆయన భార్య. విడాకులకు నిరాకరిస్తే తీవ్ర పరిణామాలుంటాయంటూ కలాంపాషాతో పాటు ఆయన సోదరుడు కమాల్ పాషా కూడా తనను బెదిరించారని ఆమె ఫిర్యాదు కూడా చేశారు. కమాల్ పాషా కూడా రిటైర్డ్ జడ్జే.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)