జోరుమీదున్న బిజెపి బండి
ఎంత మార్పు? ఒకప్పుడు బిజెపి కార్యకర్తలపై దాడులు జరిగినా, ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా రాష్ట్ర నాయకత్వం ఈ స్థాయిలో స్పందించిన దాఖలాలు లేవు. జనగామలో పోలీసుల రూపంలో నరరూప రాక్షసులు పాశవికంగా ప్రవర్తించారు. సభ్యసమాజం సిగ్గుపడేలా బిజెపి వారిని తీవ్రంగా కొట్టారు. దీనిపై బండి సంజయ్ స్పందించిన తీరు, సీఎం కెసిఆర్ కు ఇచ్చిన వార్నింగ్ ఓ సంచలనం. నీ కొడుకు పలగ్గొడితే తెలుస్తదంటూ భారీ ఆందోళనకు తమ పార్టీ సిద్ధపడుతుందని సంజయ్ సంకేతాలు ఇచ్చారు. ముఖ్యమంత్రికే 24 గంటల గడువు విధించారు. అయినా స్పందించకపోతే సీన్ వేరేగా ఉంటుందని గట్టిగానే హెచ్చరించారు. దుబ్బాక ఎన్నికల సందర్భంగా సిద్దిపేటలో పోలీసుల ఓవర్ యాక్షన్ పై సంజయ్ అగ్రహోదగ్రుడయ్యారు. ఉగ్ర నరసింహుడిలా సిద్దిపేటకు బయల్దేరారు. పోలీసుల జులుంపై గళమెత్తారు. టిఆర్ఎస్ అరాచకాలకు భయపడేది లేదంటూ కార్యకర్తల్లో కొండంత మనోబలం నింపారు. విజయం సాధించారు. గ్రేటర్ హైదరాబాద్ లో టిఆర్ ఎస్ ను చిత్తుగా ఓడించాలనే పంతం పట్టి మరీ నెగ్గారు బండి సంజయ్.
అధికార పార్టీ పోలీసులను అడ్డంపెడ్డుకుని దౌర్జన్యాలు చేస్తే ఊరుకునేది లేదని సంజయ్ స్పందన స్పష్టంగా తెలియజేస్తుంది. జనగామలో ర్యాలీగా వెళ్లి పోలీస్ రాక్షసత్వానికి గాయపడిన తన పార్టీ వారిని పరామర్శించారు. నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వారిలో స్థయిర్యం నింపారు. కుటుంబ సభ్యులు డీలా పడకుండా తగినంత మనో ధైర్యం ఇచ్చారు. నాయకుడంటే ఇలా ఉండాలని అందరికీ అనిపించేలా స్పందించారు. రాబోయే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని తన పార్టీ శ్రేణులకు ఇప్పటికే సంజయ్ నమ్మకం కలిగించారు. కాబట్టే కార్యకర్తలు తెగించి కొట్టాడుతున్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ కల్వకుంట్ల కుటుంబ పాలనలో ఆగమైపోతుంటూ చూస్తూ ఊరుకోవడం లేదు. బిజెపి క్యాడర్ తెలంగాణను కాపాడుకునే ఉద్యమాన్ని ముమ్మరంగానే చేస్తున్నది. బండి జోరు ఈ ఉద్యమానికి ఇరుసుగా మారి పరుగులు పెట్టిస్తున్నది.