అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ట్రంప్ మీద హత్యాయత్నం జరగడంతో వాతావరణం వేడెక్కింది. ఈ సంఘటనతో ట్రంప్ విజయ అవకాశాలు పెరుగుతున్నాయి అని అంటున్నారు. ఇదే సమయంలో ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఓహాయో సెనేటర్ జెడి వాన్స్ పేరుని ప్రకటించారు.
జెడి వాన్స్ భార్య ఉషా చిలుకూరి తెలుగు కుటుంబాలకు చెందినవారు.
భారతీయ అమెరికన్ సంతతికి చెందిన ఉష .. లాయరు వృత్తిలో పేరుగాంచారు. 2014లో కెంటుకీలో ఒక హిందూ పూజారి పర్యవేక్షణలో జెడి వాన్స్ మరియు ఉషా చిలుకూరి.. వివాహం చేసుకున్నారు.
ఉష చిలుకూరి అన్ని వేళల్లో భర్తకు అండగా నిలుస్తున్నారు.
భర్త విజయాలలో ఉష ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. అమెరికాలో సామాజిక క్షీణతపై ఇద్దరూ కలిసి పనిచేశారు. ఈ అనుభవాలతో ‘హిల్బిల్లీ ఎలిజీ’ పేరిట గ్రంధంగా తీసుకుని వచ్చారు.
ట్రంప్ కుటుంబానికి వాన్స్ ఎలా దగ్గరయ్యారు? వంటి ఆసక్తికరమైన విషయాలను ఇందులో పొందుపరిచారు. 2016లో ఈ గ్రంధం అమెరికాలో అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకాల్లో ఒకటిగా నిలిచింది. గ్రామీణ అమెరికా ప్రజలు ట్రంప్ను ఏవిధంగా అధికారంలోకి తీసుకొచ్చారో ఈ గ్రంధంలో వివరించారు. దీనిని 2020లో సినిమా గా కూడా తీశారు.
ఉషా చిలుకూరి మూలాలు మన తెలుగు నేల మీద ఉన్నాయి. కాలిఫోర్నియాలో భారతీయ వలస తల్లిదండ్రులకు 1986లో పుట్టారు. శాన్ డియాగో శివారు లలో పెరిగారు. తరువాత యేల్ లా స్కూల్లో చదువుకుంది. అక్కడ ఆమె 2013లో జెడి వాన్స్ను కలుసుకున్నారు.
ఈ జంట యేల్ లా స్కూల్ నుండి గ్రాడ్యుయేషన్ తర్వాత 2014 లో వివాహం చేసుకున్నారు. వాన్స్-ఉషా చిలుకూరి దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు ఇవాన్, వివేక్, మిరాబెల్. రెండో కుమారుడికి వివేకానందుని స్ఫూర్తితో వివేక్ అనే పేరు పెట్టుకోవడం గమనించాల్సిన విషయం.
ఉషా మొదటినుంచి జెడి వాన్స్ రాజకీయ ప్రయాణంలో కీలక పాత్ర పోషించారు. 2016, 2022లలో సెనేట్ ప్రచారాలతో సహా రాజకీయ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు.
దేవాలయాలను ఉషా చిలుకూరి క్రమం తప్పకుండా సందర్శిస్తారు. హైందవ కుటుంబం నుంచి వచ్చానని ఆమె అనేక ఇంటర్వ్యూ లలో స్పష్టంగా చెప్పారు. ట్రంప్ తో పాటు తెలుగువారి ఇంటి అల్లుడు జెడి వాన్స్ గెలుపుకి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.