ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి చతికిల పడిన వైసీపీకి మరోవైపు నుంచి కష్టాలు పెరుగుతున్నాయి. గోదావరి జిల్లాల్లో వైసిపి నాయకుల్లో ఎక్కువమంది బియ్యం వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఒక వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. ఈ బియ్యం వ్యాపారం సిండికేటుకు నాయకత్వం వహిస్తున్నారు అనేది బహిరంగ రహస్యం.
ప్రభుత్వాలు ఎన్ని మారినా ఈ బియ్యం వ్యాపారం సిండికేట్ కి ఎదురు ఉండేది కాదు. అధికారులను గుప్పిట్లో పెట్టుకుని సిండికేట్ హవా నడిపిస్తూ ఉండేది. కానీ ఇప్పుడు జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ పౌరసరఫరాల శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ బియ్యం అక్రమ రవాణా మీద దృష్టి పెట్టారు. ఉభయగోదావరి జిల్లాల్లో దొంగ చాటుగా సాగుతున్న బియ్యం వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నారు. దీంతో వైసీపీకి ఆర్థిక మూలాలు విరిచేసినట్లు అవుతోంది. కాకినాడ పోర్టు నుంచి పెద్ద ఎత్తున రేషన్ బియ్యం ఇతర దేశాలకు రవాణా అవుతున్నట్లుగా గుర్తించారు. కాకినాడలో గోడౌన్ లలో పెద్ద ఎత్తున అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని ఇప్పటికే సీజ్ చేయించారు.
తాజాగా కాకినాడకు వచ్చే రహదారుల మీద దృష్టిని సారించారు. పోర్టు కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ఎనిమిది విభాగాల పర్యవేక్షణలో చెక్ పోస్టులను ఏర్పాటు చేయించారు. కాకినాడ యాంకరేజ్ పోర్టు నుండి ముంబయి రోడ్డులో చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో మొన్న ఒక్క రోజునే ఆరు లారీల్లో బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ పోర్టు పీఎస్ వద్ద మరో చెక్ పోస్టు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కాకినాడ పోర్టు మార్గంలో అన్ని లారీలను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. కాకినాడ అడ్డాగా రేషన్ మాఫియా దందా సాగిస్తొందని ఇటీవల మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
బియ్యం అక్రమ రవాణా మీద ప్రభుత్వం ఉక్కు పాదం మోపడంతో ఇప్పటిదాకా ఈ వ్యాపారంలో కోట్లు గడించిన అక్రమార్కులు వణికిపోతున్నారు. ఈ వ్యాపారంలో అన్ని పార్టీలకు వాటా ఉన్నప్పటికీ వైసీపీ నాయకులు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు అనేది గోదావరి జిల్లాలో బహిరంగ రహస్యం.