కశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ హింసకు తెగబడ్డారు. ఒకేరోజు మూడుచోట్ల దాడులు చేశారు. షోపియాన్ జిల్లా చోటోగ్రామ్ లో ఓ కశ్మీర్ పండిట్ ను పొట్టనపెట్టుకున్నారు. ఉగ్రవాదులు అతన్ని కాల్చారన్న సమాచారంతో జవాన్లు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. కొనఊపిరితో ఉన్న ఆయన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆయన చనిపోయారు. స్థానికంగా చిన్న దుకాణం నడుపుకుంటున్న అతన్ని సోనూకుమార్ గా గుర్తించారు.
ఇక శ్రీనగర్ మైసుమాలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు టెర్రరిస్టులు. ఇద్దరు జవాన్లపై కాల్పులు జరపగా ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మరో జవాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పుల్వామా జిల్లాలో వలసకూలీలు లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు చేయగా… ఇద్దరు గాయపడ్డారు.