జమ్ముకశ్మీర్ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ప్రకారం ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో మొత్తం 90 శాసన సభ నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. జమ్ములో 43, కశ్మీర్లో 47 నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలో ఐదు పార్లమెంట్ స్థానాలుండగా… సమాన సంఖ్యలో అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు ఏర్పాటు చేశారు. మొట్టమొదటిసారి షెడ్యూల్డు తెగలకు శాసన సభ నియోజకవర్గాల్లో రిజర్వేషన్లు లభించాయి. షెడ్యూల్డు తెగలకు 9 స్థానాలకు కేటాయించారు. డీలిమిటేషన్ యాక్ట్, 2002లోని సెక్షన్ 9(1)(ఏ), జమ్మూ-కశ్మీరు రీఆర్గనైజేషన్ యాక్ట్, 2019లోని సెక్షన్ 60(2)(బీ) ప్రకారం ఈ ప్రక్రియ జరిగింది.
డీలిమిటేషన్ ప్రక్రియను ఓ ఏడాదిలో పూర్తి చేయవలసి ఉండగా, కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో గడువును పెంచాలని డీలిమిటేషన్ కమిషన్ కోరింది. అనంతరం మరో ఏడాదిపాటు దీని గడువును పెంచారు. డీలిమిటేషన్ కమిషన్లో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర, జమ్మూ-కశ్మీరు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కేకే శర్మ వ్యవహరించారు. ఈ కమిషన్కు విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్ నేతృత్వం వహించారు. నిర్ణీత గడువుకు ఒక రోజు ముందే ఈ నివేదికను సమర్పించారు.