కశ్మీర్లో రెచ్చిపోతున్న ఉగ్రవాదుల చర్యలను ఆరిపోయే దీపంతో పోల్చారు జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. జమ్మూలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన… “లోయలో పౌరులను లక్ష్యంగా చేసుకుని హత్య చేయడాన్ని మత పెద్దలు, కశ్మీర్ ప్రజలు ఖండిస్తున్నారు. కొవ్వొత్తి ఆరిపోబోతున్నప్పుడు, దాని జ్వాల ప్రకాశవంతంగా వెలుగుతుంది. అలాగే ఉగ్రవాదులు తమ చివరి శ్వాసను తీసుకుంటున్నారు” అని అన్నారు.
ఇటీవల లోయలో తీవ్రవాదులు స్థానికులు లక్ష్యంగా వరుస హత్యలకు తెగబడుతున్నారు. సరిహద్దుల ఆవలినుంచి వారు తిరిగి దేశంలోకి రావాలని కోరుకుంటున్నారు. పరిపాలన, భద్రతా దళాలు తమ పూర్తి శక్తితో వారిని ఎదుర్కొంటున్నాయనీ సిన్హా అన్నారు.
కశ్మీర్లో పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ నియంత్రణ రేఖ అవతలి వారికి ముప్పుగా పరిణమించిందని ఆయన అన్నారు. లోయకు చాలా మంది పర్యాటకుల రాకను లేదా ఆర్థిక వ్యవస్థ వృద్ధిని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కశ్మీర్లో బలవంతంగా అమాయకులను చంపుతున్నారని.. కొన్ని తీవ్రమైన చర్యలు తీసుకోవాలని సిన్హా అన్నారు. అయితే అమాయకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామనీ హామీ ఇచ్చారు.
రాజస్థాన్కు చెందిన 26 ఏళ్ల బ్యాంక్ ఉద్యోగి విజయ్ కుమార్.. బీహార్కు చెందిన దిల్ఖుష్ కుమార్ అనే కార్మికుడు జూన్ 2న కాశ్మీర్లోని కుల్గామ్, బుద్గామ్లో ఉగ్రవాదులు కాల్చి చంపారు. మార్చి నుంచి లోయలో 12 మంది పౌరులను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేశారు. మే 31న కాశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదులు కాల్చి చంపిన టీచర్ రజనీ బాలా హత్యకు వ్యతిరేకంగా కాశ్మీరీ హిందూ ప్రభుత్వ ఉద్యోగులు నిరసనలు చేస్తున్నారు. గత నెలలో కాశ్మీరీ పండిట్ ఉద్యోగి రాహుల్ భట్ సహా ముగ్గురు ఆఫ్ డ్యూటీ పోలీసులతో సహా ఇద్దరు పౌరులను టెర్రరిస్టులు పొట్టనపెట్టుకున్నారు.