ముస్లిం సంస్థ జమియత్ ఉలేమా-ఎ-హింద్ అక్రమ కూల్చివేతలకు వ్యతిరేకంగా సోమవారం సుప్రీంకోర్టులో రెండు తాజా పిటిషన్లు దాఖలు చేసింది. కూల్చివేత డ్రైవ్ను ఖచ్చితంగా చట్టాలకు అనుగుణంగా, గడువు తర్వాత మాత్రమే నిర్వహించేలా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని.. ప్రతి బాధిత వ్యక్తికి నోటీసు ఇవ్వాలని.. ఆ తర్వాతే చర్యలు తీసుకునేలా ఆదేశించాలని సుప్రీం కోర్టును కోరింది. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై నిరసనగా జరిగిన హింసాకాండలో ప్రధాన నిందితుడు మహమ్మద్ జావేద్ ఇంటిని ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కూల్చేసిన నేపథ్యంలో ఈ పిటిషన్ను సోమవారం దాఖలు చేసింది. కాన్పూరులో ఇటువంటి కూల్చివేతలు జరగకుండా నిలిపేయాలని కోరింది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన మున్సిపల్ చట్టాలను, చట్టాన్ని ఉల్లంఘించి కూల్చివేసిన ఇళ్లకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని కూడా కోరింది. ప్రయాగ్రాజ్ అభివృద్ధి సంస్థ ఆదివారం మహమ్మద్ జావేద్ ఇంటిని కూల్చేసింది. ఆయన భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించి, ఈ ఇంటిని నిర్మించారని ఆరోపించింది.
ఢిల్లీలోని జహంగీర్పురిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను సుప్రీంకోర్టు ఏప్రిల్లో నిలిపేసింది. ఈ పెండింగ్ వ్యాజ్యంలో తాజా పిటిషన్ను జామియా సోమవారం దాఖలు చేసింది. కాన్పూరులో జరిగిన హింసాకాండ నేపథ్యంలో కొందరు అధికారులు మీడియాతో మాట్లాడుతూ, నిందితులు, అనుమానితుల ఆస్తులను జప్తు చేస్తామని, కూల్చేస్తామని చెప్పారని పేర్కొంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా నిందితుల ఇళ్ళను బుల్డోజర్లతో కూల్చేస్తామని మీడియాలో చెప్పారని పేర్కొంది. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇదేవిధంగా హెచ్చరించారని తెలిపింది.
చట్టానికి అతీతంగా చేపట్టే ఇటువంటి చర్యలు సహజ న్యాయ సూత్రాలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని పిటిషన్ లో సంస్థ ఆరోపించింది. ఏదైనా నేరారోపణను ఎదుర్కొంటున్న నిందితులపై చట్టానికి అతీతంగా దండన చర్యగా వారి నివాస లేదా వ్యాపార ఆస్తులపై కాన్పూరు జిల్లాలో ఆత్రుతగా ఎటువంటి చర్యలు చేపట్టకుండా ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది. ముందుగా నోటీసు ఇచ్చి, ప్రభావిత వ్యక్తుల్లో ప్రతి ఒక్కరినీ తగిన రీతిలో విచారించి.. వారి వాదనలు విన్న తర్వాత మాత్రమే చర్యలు తీసుకునే విధంగా ఆదేశించాలని కోరింది.