భారత్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని అన్నీ గమనిస్తున్నామని అమెరికా చేసిన వ్యాఖ్యలకు భారత్ ధీటుగానే బదులిచ్చింది.భారత్ తో సత్సంబంధాలు కోరుకుంటున్నామంటూనే ప్రతీ అంశాన్ని ఎత్తిచూపుతున్న అగ్రరాజ్యానికి గట్టి ఆన్సరే ఇచ్చారు విదేశాంగ మంత్రి జైశంకర్. ప్రస్తుతం అమెరికా పర్యటనలోనే ఉన్న ఆయన భారత వైఖరిని స్పష్టం చేశారు. భారత్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అంటే… అమెరికాలో మానవహక్కుల ఉల్లంఘన గురించీ తమకు తెలుసని…సందర్భం వచ్చినప్పుడు దానిమీద చర్చించడానికి, తమ అభిప్రాయం చెప్పడానికి వెనకాడబోమని ఘాటుగా బదులిచ్చారు జైశంకర్.
వాషింగ్టన్లో భారత్, అమెరికాకు మధ్య 2+2 స్థాయిలో చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సమయంలోనే అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ మాట్లాడుతూ.. భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలు పెరుగుతున్న విషయం గమనించామని…వాటికి ముగింపు పలికేవరకు ఆ దేశంతో సంప్రదింపులు జరుపుతామని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం, పోలీసులు, జైలు అధికారులే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తరువాత ప్రెస్ బ్రీఫ్ సందర్భంగా అమెరికా ఆరోపణల్ని తిప్పికొట్టారు. అమెరికా సహా ఇతర దేశాల్లోని మానవ హక్కుల పరిస్థితినీ భారత్ పర్యవేక్షిస్తోంది అని అన్నారు. “మా దేశ పరిస్థితులపై ఎవరికైనా ఎలాంటి అభిప్రాయాలైనా ఉండవచ్చు. అదే సమయంలో ఆయా దేశాల మానవహక్కులు, వారి లాబీయింగ్, ఓటు బ్యాంక్ అంశాలపై మాకూ అభిప్రాయం ఉంటుంది. అయితే చర్చ జరిగినప్పుడు మేం వాటిమీద అభిప్రాయం చెబుతాం. అమెరికా సహా ఇతర దేశాల్లో మానవహక్కుల పరిస్థితులపై మాకూ అభిప్రాయాలుంటాయి’అని ఆయన అన్నారు.
అంతేకాదు మరింత ముందుకెళ్తూ తాజాగా అక్కడ జరిగిన ఘటనను జై శంకర్ ప్రస్తావించారు. మంగళవారం న్యూయార్క్లో బరో ఆఫ్ క్వీన్స్లో ఇద్దరు సిక్కులపై దాడి జరిగింది. కొద్ది రోజుల క్రితం కూడా సిక్కువ్యక్తిపైనే అక్కడే దాడి జరిగింది. అమెరికాలో 5 లక్షలకుపైగా సిక్కులున్నారు. ప్రపంచంలో ఐదోమతం సిక్కు. భారతీయ సమాజం గురించి మాట్లాడేట్టైతే… అమెరికాలోని భారతీయ సమాజంపై విద్వేషపూరిత నేరాల గురించీ మాట్లాడాల్సి ఉంటుందని ఆయన అన్నారు.