ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి రాంపూర్ హాట్ సీట్ గా మారనుంది. ఇంతకాలం జైల్లో ఉన్న ఆజంఖాన్ కుమారుడు అబ్దుల్లా ఖాన్ బెయిల్ మీద బయటకు రావడంతో అక్కడ వాతావరణం హీటెక్కింది. అబ్దుల్లా రాంపూర్ జిల్లాలోని స్వర్ తండా నుంచి ఎస్పీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఇక ఖాన్ కుటుంబ అరాచకాలను వెలికితీసి కేసులు పెట్టి ఆ కుటుంబం జైలుపాలవడానికి కారణమైన ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఆకాశ్ సక్సేనాను బీజేపీ రంగంలోకి దింపుతోంది.

Azam Khan(Left) Akhilesh Yadav(Right)
గత వారమే అబ్దుల్లా ఖాన్ సీతాపూర్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆజంఖాన్ గత అసెంబ్లీ ఎన్నికల్లో రాంపూర్ స్థానం నుంచి పోటీచేసి గెలవగా… అబ్దుల్లా స్వర్ తండానుంచి విజయం సాధించారు. అయితే అతనికప్పుడు ఎన్నికల్లో పోటీచేయడానికి కావల్సిన కనీస వయసు 25 ఏళ్లు లేకపోవడంతో ఎన్నికను రద్దు చేసింది అలహాబాద్ హైకోర్టు. అంతే కాదు ఎన్నిక సందర్భంగా ఫేక్ బర్త్ సర్టిఫికెట్ సమర్పించిన నేరానికే అరెస్టై జైలుకెళ్లాల్సి వచ్చింది. అబ్దుల్లా బర్త్ సర్టిఫికెట్లో ఒకదాంట్లో రాంపూర్లో పుట్టినట్టు… మరొకదాంట్లో లక్నోలో పుట్టినట్టుగా ఉంది. అదే కేసులో తండ్రి ఆజం ఖాన్ కూడా అరెస్టై జైల్లో ఉన్నారు. ఆయనకూ కొద్దిరోజుల్లోనే బెయిల్ వచ్చే అవకాశాలున్నాయని…ఆయనా ఈసారి రాంపూర్ నుంచి మరోసారి పోటీ చేస్తారని పార్టీవర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇప్పటికైతే అబ్దుల్లాకు మాత్రం స్వర్ తండా టికెట్ ను ఖాయం చేసింది సమాజ్ వాదీ పార్టీ.
సమాజ్ వాదీ పార్టీకి రాంపూర్ కంచుకోట అని చెప్పవచ్చు. అక్కడినుంచి 9 సార్లు ఆయన ఎన్నికయ్యారు. 2017 ఎన్నికల్లో బీజేపీ హవాలోనూ ఆ పార్టీ అభ్యర్థి శివబహదూర్ సక్సేనాను 47 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో ఓడించారు. ఆ ఎన్నికల్లో అబ్దుల్లా ఆజం కూడా స్వర్ తండానుంచి పోటీ చేసి గెలిచినా వయసు తక్కువగా ఉందని అలహాబాద్ హైకోర్టు ఆయన ఎన్నికను కొట్టేసింది. తరువాత తండ్రీ కొడుకులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. అత్యున్నత ధర్మాసనం కూడా కింది కోర్టు తీర్పును సమర్థించింది.
గతవారమే విడుదలైన అబ్దుల్లాపై రాంపూర్లో 43 కేసులున్నాయి. అన్ని కేసుల్లోనూ విడుదల ఉత్తర్వులు పొందారు. 2020 ఫిబ్రవరి నుంచి పలు కేసుల్లో జైలులో ఉన్నాడు జూనియర్ ఖాన్. ఫేక్ బర్త్ సర్టిఫికెట్ కేసులో అయితే కొడుకుతోపాటు తండ్రీ శిక్ష అనుభవించాడు. అంతకుముందు 2019 ఆగస్టులో కూడా ఓసారి జైలుకెళ్లాడు. మహ్మద్ అలీ జౌహార్ యూనివర్సిటీ భూముల కబ్దా కేసులో తండ్రీకొడుకులిద్దరూ దేషులేనని న్యాయస్థానం తేల్చింది.
2019 ఆగస్టులో మహ్మద్ అలీ జౌహర్ యూనివర్సిటీ పరిసరాల్లోని 250ఏళ్లనాటి మదర్సాపై దాడి చేసి విలువైన పుస్తకాలు దొంగలించారనే ఆరోపణలతో కేసు నమోదైంది. మదర్సాలోని 9వేల పుస్తకాలు సహా పురాతన రాతప్రతుల్ని దొంగలించుకెళ్లాడంటూ మదర్సా ప్రిన్సిపల్ స్వయంగా ఫిర్యాదు చేశారు.
అంతకుముందు భూకబ్జాలు, సింహాల విగ్రహాల చౌర్యం, ప్రాచీన పుస్తకాలు, పురాతన రాతప్రతుల దొంగతనం కేసుతో పాటు…గేదెలను దొంగలించిన కేసు కూడా నమోదైంది.అంతేకాదు రాంపూర్ ఎంపీ అయి ఉండి విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డారు ఆజం. ఉత్తరప్రదేశ్లోని ఆజం ఖాన్ రిసార్ట్ ‘హమ్సఫర్’ రిసార్ట్లో ఉత్తరప్రదేశ్ విద్యుత్ శాఖ దాడులు చేసి సరఫరా నిలిపేసింది. ఆజం స్వయంగా వచ్చి మేకలు దొంగలించారంటూ… అక్టోబర్ 2016లో నమోదైన ఫిర్యాదును తీసుకుని 2019 సెప్టెంబర్లో మరో కేసు పెట్టారు పోలీసులు.
2017లో యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చినదగ్గర్నుంచి ఖాన్ కుటుంబసభ్యులపై మొత్తం 81 కేసులు నమోదయ్యాయి. ఈ 81 కేసుల్లో కొన్నింటిలో ఖాన్ భార్య తంజీన్ ఫాతిమా, రాంపూర్ సదర్ ఎమ్మెల్యే అబ్దుల్లా సహనిందితులుగా ఉన్నారు.
యోగీ ప్రభుత్వ హయాంలో వై కేటగిరీ భద్రతతో వ్యాపారం సాగిస్తున్న స్వయం సేవకుడు అయినా సక్సేనా మొదటిసారి ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఆయన తండ్రి శివ్ బహదూర్ సక్సేనా రాంపూర్ నుంచే బీజేపీ టికెట్ పై రెండుసార్లు పోటీ చేసి…ఒకసారి ఖాన్ చేతిలో ఓఢిపోయారు. తరువాత రాంపూర్లోని స్వర్ తండా నుంచి 1989 నుంచి 2012 మధ్య నాలుగుసార్లు గెలిచి.. రెండుసార్లు మంత్రిగా పనిచేశారు.
అయితే ఖాన్ కు, తనకు మధ్య వ్యక్తిగత వివాదాలేంలేవని…సైద్ధాంతిక విభేదాలు మాత్రమే ఉన్నాయని సక్సేనా అంటున్నారు. గతంలో భరతమాతపై ఆజం చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరమైనవని గుర్తు చేస్తూ అందుకే ఆయన అవినీతిని ప్రశ్నిస్తూ పోరాటం చేశానన్నారు. అఖిలేశ్ ప్రభుత్వ హయాంలోనూ ఆయనకు, గవర్నర్ కు ఫిర్యాదు చేశానని అన్నారు. అఖిలేశ్ ను వ్యక్తిగతంగా కలిసినా విచారణ జరిపించలేదన్నారు. యోగీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీనియర్ అధికారులకు ఫిర్యాదు చేసినంతనే విచారణ జరిపి కేసు నమోదు చేశారని…తన ప్రయత్నం వల్లే చాలామంది పేదలు తమ భూములు తిరిగి పొందారంటున్నారు సక్సేనా. ఖాన్ పై కేసులు వేసినందుకు మాత్రమే తనకు టికెట్ రాలేదని…తన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని పార్టీ గుర్తించిందని తాను అనుకుంటున్నానని చెప్పారు.
ఇక ఆమ్ ఆద్మీపార్టీ నుంచి పోటీ చేస్తున్న పైసల్ ఖాన్ కూడా ఖాన్ కుటుంబంపై ముప్పేటదాడి చేస్తూనే ఉన్నారు. మరి మరోసారి ఖాన్ కుటుంబం ఇక్కడ పట్టునిలుపుకుంటుందా…లేదా ఆ కుటుంబ అక్రమాలపై పోరాటం సాగిస్తున్న సక్సేనా సక్సెస్ అవుతారా..లేక ఇద్దరి మధ్య పోరులో ఆ సీటును ఆప్ ఊడ్చేస్తుందా చూడాలి.