దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర,కేరళ,తమిళనాడుతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో పొరుగు రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. అయితే ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న టూరిస్టు ప్లేసుల్లో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా అక్కడి అధికారులు అప్రమత్తమవుతున్నారు. ప్రపంచ ప్రసిద్ధి పర్యాటక కేంద్రంగా పేరున్న ఊటీలో కూడా అధికారులు అలర్ట్ అయ్యారు. అంతేకాదు.. ఇక్కడి వచ్చే వారు నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఊటీ ప్రాంతంలో మాస్క్ ధరించకుండా తిరిగితే ఆరు నెలల పాటు జైలుశిక్ష విధిస్తామని నీలగిరి జిల్లా కలెక్టర్ ఇన్సెంట్ దివ్య హెచ్చరించారు. గతకొద్ది రోజులుగా మళ్లీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందని.. ఇందుకు కారణం ప్రజల్లో ఉన్న నిర్లక్ష్యమేనని.. మాస్కులు లేకుండా విచ్చలవిడిగా తిరుగుతుండటంతో పాటు.. సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడమేనని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే నీలగిరి జిల్లా కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఊటీలోని ప్రజలు గానీ, పర్యాటకులు గానీ మాస్కులు ధరించకుండా బయట సంచరిస్తే 6 నెలల జైలుశిక్ష విధించనున్నట్లు హెచ్చరికలు జారీచేశారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు లేకుండా సంచరిస్తున్న వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా 20 టీంలను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు.