జాహ్నవి దంగేరి పేరు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మార్మోగిపోతోంది. పదహారు అణాల ఈ తెలుగు అమ్మాయి ఇప్పుడు అంతరిక్ష యానం కోసం ఎంపిక అయింది. సునీతా విలియమ్స్ వంటి వారు అంతరిక్షంలోకి అడుగు పెట్టినప్పటికీ, అమెరికా పౌరులుగానే అవకాశం దక్కించుకొన్నారు. భారత్ లోనే పుట్టి పెరిగిన అమ్మాయిలు ఎవరూ ఇప్పటి దాకా అంతరిక్ష యానానికి ఎంపిక కాలేదు.
…
పశ్చిమ గోదావరి జిల్లా లోని పాలకొల్లులో పుట్టిన జాహ్నవి దంగేరి అసలు సిసలు తెలుగు అమ్మాయి. తల్లిదండ్రులు శ్రీనివాస్, పద్మశ్రీ చిన్నపాటి ఉద్యోగాలు చేస్తూ అమ్మాయిని చదివించుకొన్నారు. తల్లిదండ్రులు ఉపాధి కోసం కువైట్ వెళ్లటంతో అమ్మమ్మ లీలావతి .. స్వయంగా జాహ్నవిని పెంచారు. చిన్నప్పటి నుంచి చందమామ కథలు వింటూ పెరిగిన జాహ్నవి.. చంద్రుడు, చుక్కల మీద ఆసక్తితో శాటిలైట్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యారు.
…
అప్పటి నుంచి ఆమె కథ మారిపోయింది. చిన్న వయస్సులోనే పోలాండ్ లోని అనలాగ్ వ్యోమగాముల శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందారు. అతి చిన్న వయస్సులోనే అనలాగ్ వ్యోమగామిగా గుర్తింపు తెచ్చుకుంది. నాసా నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్లో పాల్గొని చరిత్ర సృష్టించారు. అప్పటి వరకు భారతదేశం నుంచే కాదు, ఆసియా ఖండం నుంచి ఒక అమ్మాయి పాల్గొన్న తొలి సందర్భం అది. ఇప్పటికే చిన్న రాకెట్ అయిన ‘సెస్నా 171 స్కైహాక్’ ను విజయవంతంగా నడిపి రికార్డ్ సృష్టించింది. 16 దేశాల యువతతో కూడిన బృందానికి ఫ్లైట్ డైరెక్టర్గా కూడా వ్యవహరించింది. అంతరిక్ష ప్రయాణానికి అవసరమైన దాదాపు అన్ని నైపుణ్యాలను ఆమె నేర్చేసుకుంది.
..
ఇవన్నీ పరిశీలించిన తర్వాత అమెరికన్ స్పేస్ సంస్థ.. టైటాన్ స్పేస్ ఆమెకు అద్బుతమైన అవకాశం ఇచ్చింది.
టైటాన్ స్సేస్ రోదసీలో భారీ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనుంది. భవిష్యత్లో అంతరిక్ష ప్రయోగ, వాణజ్య, పర్యాటక కేంద్రంగా దీన్ని తీర్చిదద్దనుంది. ఈ మిషన్లో భాగంగా తొలుత కొద్దిమంది అంతరిక్ష పరిశోధక వ్యోమగాములు, పర్యాటకులను అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది. ఇందులో భాగంగా జాహ్నవి కి అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం కల్పించారు. రాబోయే మూడేళ్లపాటు టైటాన్ స్పేస్ అనలాగ్ ప్రోగ్రామ్లో ఆమె కఠినమైన వ్యోమగామి శిక్షణ పొందనున్నారు. 2029లో అంతరిక్షంలోకి ప్రవేశించి.. ఆర్బిటల్ స్పేస్ ఫ్లైట్ ద్వారా అంతరిక్షంలో పరిశోధనలు చేపడతారు.
..
నిండా పాతికేళ్లు లేని జాహ్నవి సాధించిన ఈ ఘనత పట్ల కుటుంబ సభ్యులు పొంగిపోతున్నారు. ఈ కాలం యువతకు ఆమె స్ఫూర్తిదాయకం అని స్థానికులు అంటున్నారు.