పేదరికం కారణంగా ఎవరి చదువులు ఎంత మాత్రం ఆగరాదన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఉజ్వల భవిష్యత్తుకు చదువులే పునాది అని …అందుకే నాణ్యమైన ఉన్నత చదువులు అందించడమే ధ్యేయంగా జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలను అమలు చేస్తున్నామన్నారు. తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరు వేదికగా 2023 విద్యా సంవత్సరంలో జనవరి మార్చి త్రైమాసికానికి సంబంధించి 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 703 కోట్ల నిధులను సీఎం జమ చేశారు. ఈ సందర్భంగా కొవ్వూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు.. నాలుగేళ్లలో కేవలం విద్యార్థుల ఉన్నత చదువుల కోసమే రూ. 14,912 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. గత టీడీపీ ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించకుండా పెండింగ్ లో ఉంచిన రూ. 1,778 కోట్లనూ తాము చెల్లించామన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో మొదలైన చదువుల విప్లవం దేశానికి దశ దిశ చూపిస్తుందన్నారు. పిల్లల చదువులపై చేస్తున్న ఖర్చు మానవ వనరులపై చేస్తున్న పెట్టుబడి అని దీంతో రాష్ర్ట సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని అన్నారు. సమాజంలో వివక్ష పోవాలంటే పేదరికం పోవాలని అందుకు చదువే అస్త్రంగా పనిచేస్తుందనీ అన్నారు.
నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నామని దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య 30 లక్షల నుంచి 40 లక్షలకు పెరిగిందని గుర్తుచేశారు. ఉన్నత విద్యలో నాణ్యత కోసం కరిక్యులమ్ ను జాబ్ ఓరియెంటెడ్గా ఉండేటట్లు తీర్చిదిద్దామన్నారు.
ప్రతి కుటుంబం నుంచి ఒక సత్య నాదెళ్ల రావాలని ఆకాంక్షించిన జగన్… అందుకు విద్యార్థులు ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ప్రతిభ ఉన్న ప్రతి విద్యార్థికి తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు..