ములుగు జిల్లాలో ప్రతిపాదిత గిరిజన వర్సిటీ త్వరలోనే సాకారం కానుంది. ప్రస్తుతం వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే వర్సిటీ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు కేంద్రం ప్రకటించింది. బిల్లు వివరాల్ని లోక్ సభ, రాజ్యసభ సచివాలయాలకు పంపింది పార్లమెంటరీ వ్యవహారాల శాఖ. ఏపీ పునర్విభజన చట్టంలో భాగంగా రాష్ట్రానికి ఈ విశ్వవిద్యాలయాన్ని కేటాయించింది కేంద్రం. జిల్లా కేంద్రం సమీపంలోని గట్టమ్మ దేవాలయం వద్ద స్థలం కేటాయింపు, భూసేకరణ ఇప్పటికే పూర్తి కాగా తాజాగా కేంద్ర ప్రకటనతో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవలే జిల్లాకు చెందిన చారిత్రక రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించడంతో ములుగు పేరు అంతటా మార్మోగింది. ఇక గిరిజన వర్సిటీ రాకతో మరింత అభివృద్ధి ఖాయమని స్థానికులు ఆశాభావంతో ఉన్నారు.
అసలైతే…2019 జూలై నుంచి తరగతులు నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. మొదట ఆరు కోర్సులను ప్రవేశపెట్టింది. కోర్సులో 30మందికి చొప్పున 180మందికి అడ్మిషన్లు ఇవ్వాలని అనుకున్నారు. నిర్వహణ బాధ్యతను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కొంతకాలం ఇచ్చారు. కానీ తగినట్లుగా గదుల ఏర్పాటు, సదుపాయాల కల్పనకు సంబంధించి అడుగులు ముందుకు పడలేదు. ఎట్టకేలకు కేంద్రమే వర్సిటీ పూర్తి బాధ్యతను తీసుకుంటూ నిర్మాణం, నిర్వహణకు ముందుకు వచ్చాయి.
వర్సిటీ ఏర్పాటుపై రెండు పర్యాయాలు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ములుగుకు వచ్చారు. 2017 ఫిబ్రవరి 23న మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి సుఖ్బీర్సింగ్ నేతృత్వంలోని బృందం మొదటిసారిగా ఇక్కడకు వచ్చింది. ములుగుకు సమీపంలోని గట్టమ్మ దేవాలయం వద్ద భూములను పరిశీలించి యూనివర్సిటీ స్థాపనకు అనుకూలమైన ప్రదేశమని స్పష్టం చేసింది. 2018 డిసెంబర్ 31న కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి ఆర్.సుబ్రహ్మణ్యం స్థల పరిశీలన చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. వర్సిటీ ఏర్పాటుకు 498 ఎకరాల భూమి అవసరం కాగా.. డీజీపీఎస్ (డయాగ్నల్ గ్లోబల్ పొజిషన్ సిస్టం) సర్వే పూర్తిచేశారు. 837 సర్వేనెంబర్లో 268 ఎకరాల ప్రభుత్వ భూమిలో గతంలో అసైన్డ్ చేసిన 115.09 ఎకరాల భూములకు నష్టపరిహారం చెల్లించిన రెవెన్యూ అధికారులు, మొత్తంగా 268 ఎకరాలను ఏటూరునాగారం ఐటీడీఏకు అప్పగించారు. మరో 50 ఎకరాలను అటవీ శాఖ నుంచి సేకరించాలని నిర్ణయించారు.