యూపీతో పోటీకి మరో రాష్ట్రం.. హోషంగాబాద్ నగరం పేరు మార్పు
https://twitter.com/ANI/status/1362774012619673607
దేశంలో అనేక నగరాలకు రెండేసి పేర్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఒకటి అధికారికంగా పిలవబడే పేరు అయితే.. మరొకటి మాత్రం పురాతన పేరు. మొగులులు, సుల్తానులు పరిపాలించన సమయంలో దేశంలోని ప్రముఖ నగరాల పేర్లను మార్చేశారు. నగరాల్లో ఉన్న ప్రసిద్ధి దేవాలయాలు ధ్వంసం చేస్తూ.. వాటిపై మసీదులను నిర్మించారు. అనంతరం ఆ నగరాల పేర్లను సుల్తాన్ల పేర్లతో నామకరణం చేశారు. అయితే గతకొన్నేళ్లుగా దురాక్రమణ దారుల పేర్లతో నగరాలను పిలవడమేంటని.. వెంటనే ఆ పేర్లను మార్చేయాలని డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే యూపీలో అనేక నగరాల పేర్లను యోగీ సర్కార్ మార్చేసింది. అలహాబాద్ పేరును “ప్రయాగా”గా మార్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఫైజాబాద్ పేరును అయోధ్యగా పేరు మార్పు చేసింది. ఈ క్రమంలో యూపీ సర్కార్కు పోటీగా మధ్యప్రదేశ్ సర్కార్ కూడా నగరాల పేర్ల మార్పుకు రెడీ అయ్యింది.
హోషంగాబాద్ జిల్లా పేరును నర్మదాపురంగా మార్పు చేశారు. నర్మదా జయంతి సందర్భంగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హోషంగాబాద్ పేరును నర్మదాపురంగా మారుస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే కేంద్రం దగ్గర పేరుమార్పుపై ప్రస్తావిస్తామని తెలిపారు. సీఎం ప్రకటనను హోషంగాబాద్ ప్రజలు స్వాగతించారు. వాస్తవానికి ఎన్నికలకు ముందు నుంచి స్థానిక ప్రజలు నర్మదాపురంగా మార్చాలంటూ డిమాండ్ లేవనెత్తారు. దీంతో బీజేపీ నేతలు ప్రజల డిమాండ్కు తగ్గట్టుగా పేరు మార్పు చేశారు. స్థానిక ప్రజలే కాదు.. సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, బీజేపీ నేత రామేశ్వర్ శర్మ కూడా హోషంగా బాద్ పేరును మార్చేయాలని కోరారు. వారు కూడా నర్మదాపురం అని పేరు పెట్టాలని సూచించారు. అందుకు కారణం ఈ నగరం నర్మదా నది ఒడ్డునే ఉంటుంది.
హోషాంగ్ షా ఒక దోపిడీదారుడని.. నర్మదాపురం నగరంపై దాడి చేసి అనేక దేవాలయాలను ధ్వంసం చేశాడని.. అంతేకాదు వాటిలో అనేక దేవాలయాలను మసీదులుగా మార్చేశాడని స్థానిక ప్రజలు చెబుతుంటారు. అలాంటి దుర్మార్గుడి పేరుతో నగరం ఉండటం సమంజసం కాదని అందుకే నగరం పేరు మార్చాలని కోరామని స్థానికులు తెలిపారు.