కాశీ విశ్వనాథ్ కారిడార్ ను ప్రారంభించిన తరువాత వారణాశికి సందర్శకుల తాకిడి పెరిగింది. కొత్తగా నిర్మించిన కారిడార్ గుండా గంగ నుంచి గర్భగుడిని దర్శించుకుంటున్న భక్తులు ఆ పురాతన నగరంలోని ఇతర ఆలయాలనూ ఆసక్తిగా తిలకిస్తున్నారు. ముస్లిం దురాక్రమణ దారుల చేతిలో కాశీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో వేలాదిగా హిందూ ఆలయాలు ధ్వంసం అయ్యాయి. అయితే 12 శతాబ్దానికి చెందిన ఒకే ఒక్క ఆలయం మాత్రమే అలాగే మిగిలి ఉందని మీకు తెలుసా…అవును అదే కర్దమేశ్వర్ ఆలయం. కాశీ పురిలోనూ, చుట్టుపక్కల వేలాది ఆలయాలన్నీ ముస్లిం ఆక్రమణదారుల చేతుల్లో ధ్వంసం అయినా….ఇదొక్కటి మాత్రమే 800 వందల ఏళ్లనాడు కట్టింది కట్టినట్టుగానే ఉంది.
అందమైన పుష్కరిణి ఒడ్డున కర్దమేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని నిర్మించారు. ఇప్పుడున్న ఈ ఆలయాన్ని
12వ శతాబ్దంలో గర్వాల్ రాజులు నిర్మించారు. దీని నిర్మాణంలో పూర్తిగా సాండ్ స్డోన్ నే (ఇసుకరాయి) వాడారు. నగరా నిర్మాణ శైలిలో దీన్నితీర్చిదిద్దారు. అక్కడి పుష్కరిణిని నాటి బెంగాల్ రాణి రాణీభవానీ నిర్మించారని చరిత్ర చెబుతోంది.
ఆలయ శిల్పకళా సంపదను చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. ఆలయ శిఖరం, ప్రాకారాలు, స్తంభాలు, మంటపంలో అద్భుతమైన శిల్పకళాసోయగం సందర్శకుల్ని ఎంతో ఆకట్టుకుంటోంది.