దేశం నుంచి త్వరలో కాంగ్రెస్ మాయం అవ్వడం ఖాయం
దేశం నుంచి కాంగ్రెస్ పార్టీ త్వరలోనే మాయమవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. పుదుచ్చేరిలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమిత్ షా ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు కారైక్కాల్లో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా ప్రసంగించారు. పుదుచ్చేరిలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ను ఎవరూ కూల్చలేదని.. సీఎం నారాయణ స్వామి తీరు నచ్చకనే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రాజీనామా చేశారన్నారు. దీంతో మెజారిటీ లేక కాంగ్రెస్ సర్కార్ పతనమైందన్నారు.
కేంద్రం పుదుచ్చేరి అభివృద్ధి కోసం రూ.15 వేల కోట్లకు పైగా నిధులను ఇచ్చిందని.. వాటిని మునుపటి ప్రభుత్వం గాంధీ కుటుంబానికి మళ్లించిందని ఆరోపించారు. ఇటీవల రాహుల్ గాంధీ.. జాలర్ల సంక్షేమం కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలేదని ఆరోపించారని.. అసలు రెండేళ్ల క్రితమే కేంద్రంలో మత్స్యశాఖ పనిచేస్తుందని షా అన్నారు. కేంద్రంలో ఏయే శాఖలు ఉన్నాయో కూడా తెలియని నాయకుడికి మద్దతిస్తారా..? అంటూ ప్రజలను ప్రశ్నించారు. బీజేపీ కూటమిని గెలిపిస్తే.. పుదుచ్చేరిని అన్ని రంగాల్లో డెవలప్ చేస్తామని హామీ ఇచ్చారు.